రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో మరోసారి కదలిక మొదలైంది. ఈ నెల 19న విజయవాడలోని సీబీఐ కోర్టులో విచారణకు హాజరుకావాలని తనకు నోటీసులు అందాయని ఆయేషా తల్లి షంషాద్ బేగం తెలిపారు. తెనాలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 18 ఏళ్లుగా తమ కుటుంబం న్యాయం కోసం పోరాడుతూనే ఉందని, విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సీబీఐ తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.సీబీఐ కొన్ని నెలల క్రితమే హైకోర్టుకు సీల్డ్ కవర్లో తుది నివేదిక సమర్పించిందని షంషాద్ బేగం గుర్తుచేశారు. ఆ నివేదిక కాపీలను తమకు ఇవ్వకుండా, కేసుపై తమ అభిప్రాయం చెప్పమని కోరడంలో అర్థం లేదని ఆమె ప్రశ్నించారు. "నివేదికలో ఏముందో తెలియకుండా మేం ఏం చెప్పగలం సత్యంబాబు నిర్దోషి అని మేము మొదటి నుంచి నమ్ముతున్నాం. అలాంటిది మళ్లీ అతనిపైనే కేసు పెట్టి మా అభిప్రాయం అడగటం ఏంటి?" అని ఆమె నిలదీశారు. స్వయం ప్రతిపత్తి గల సీబీఐ కూడా తమ బిడ్డకు న్యాయం చేయలేకపోయిందని ఆమె వాపోయారు.కేసు దర్యాప్తు కోసం మత సంప్రదాయాలను పక్కనపెట్టి తమ కుమార్తె మృతదేహానికి రీ-పోస్టుమార్టంకు కూడా అంగీకరించామని ఆమె గుర్తుచేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీ తక్షణమే స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని షంషాద్ బేగం విజ్ఞప్తి చేశారు.2007 డిసెంబర్ 27న ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో సత్యంబాబును అరెస్టు చేయగా, సుదీర్ఘ విచారణ తర్వాత 2017లో హైకోర్టు అతడిని నిర్దోషిగా తేల్చింది. అనంతరం ఆయేషా తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. 2018లో దర్యాప్తు చేపట్టిన సీబీఐ, ఇటీవల నివేదికను కోర్టుకు సమర్పించినా దాని వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa