అనంతపురం జిల్లా రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ తోపుదుర్తి భాస్కర్ రెడ్డి (70) గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పనులను పర్యవేక్షిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది., భాస్కర్ రెడ్డి తన పొలంలో కూలీలతో పనులు చేయిస్తున్నారు. ఆ సమయంలో ఫోన్లో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.తోపుదుర్తి భాస్కర్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. ఆయన అర్ధాంగి తోపుదుర్తి కవిత, ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తించారు. వైసీపీ ఆవిర్భావం అనంతరం భాస్కర్ రెడ్డి దంపతులు ఆ పార్టీలో చేరారు.ఆయన మృతదేహాన్ని అనంతపురంలోని రామచంద్రనగర్లోని స్వగృహానికి తరలించారు. విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మాజీ ఎంపీ రంగయ్య, గంగుల భానుమతి, మధుసూదన్రెడ్డి తదితర నేతలు భాస్కర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. భాస్కర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అనంత వెంకటరామిరెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు. భాస్కర్ రెడ్డికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మరణంతో జిల్లా వైసీపీ శ్రేణుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa