ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో జరగనున్న మ్యాచ్ను బహిష్కరించాలంటూ తీవ్రస్థాయిలో డిమాండ్లు వెల్లువెత్తుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ఈ వివాదంపై స్పష్టత ఇచ్చింది. మ్యాచ్ను బాయ్కాట్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఉగ్రవాదాన్ని, క్రీడలను వేర్వేరుగా చూడాలని స్పష్టం చేసింది.ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్తో క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలనే వాదన ఊపందుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ‘#BoycottINDvsPAK’ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులు సైతం మ్యాచ్ను రద్దు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు.ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ, "ఉగ్రదాడి, క్రికెట్ మ్యాచ్ అనేవి రెండు పూర్తిగా భిన్నమైన అంశాలు. రెండింటినీ ఒకే కోణంలో చూడకూడదు. ఆట అంటేనే భావోద్వేగాలతో కూడుకున్నది. క్రీడాకారులు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వస్తారు. అలాంటి సమయంలో మ్యాచ్ను వ్యతిరేకించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ క్రీడల విధానాన్ని ప్రకటించాం" అని అన్నారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, అన్ని విషయాలను ఆలోచించాలని ఆయన సూచించారు. క్రీడలు, ఇతర అంశాలను కలపడం సరికాదని, ఇలాంటి సున్నితమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలని మంత్రి వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa