ఆసియాకప్ 2025లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు ముందు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఓవైపు బాయ్కాట్ డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ బీసీసీఐ మాత్రం మ్యాచ్ నిర్వహణ వైపే మొగ్గుచూపింది. ఈ పరిస్థితుల్లో హైవోల్టేజ్ మ్యాచ్లో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఇక ఈ బ్లాక్ బాస్టర్ మ్యాచ్కు ముందు క్రిస్ గేల్.. చేసిన ఓ పోస్టు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
“ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఉర్రూతలూగించేందుకు భారత్ - పాకిస్థాన్ క్రికెట్ జట్లు మళ్లీ సిద్ధమయ్యాయి. అయితే ఈసారి రెండు జట్లూ కూడా తమ సూపర్ స్టార్లు లేకుండా మ్యాచ్ ఆడుతున్నాయి. దీంతో భారత్, పాకిస్థాన్ రైవలరీలో కొత్త శకానికి తెరలేవనుంది. ఏదిఏమైనా.. సీనియర్ ప్లేయర్లు లేకున్నా.. ఇవాళ్టి దాయాదుల మ్యాచ్ అదిరిపోతుందని ఆశిస్తున్నా” అని క్రిస్ గేల్ ట్వీట్ చేశాడు.
కాగా క్రిస్ గేల్ ట్వీట్లో నిజం ఉంది. ఎందుకంటే ఈ టోర్నీలో భారత్.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగుతోంది. గత దశాబ్ద కాలంలో వీరిలో కనీసం ఒకరైనా పాకిస్థాన్తో మ్యాచ్ కోసం తుది జట్టులో ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆసియాకప్ టీ20 ఫార్మాట్లో జరుగుతుంది. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత రోహిత్, కోహ్లీ పొట్టి క్రికెట్కు గుడ్బై చెప్పారు. దీంతో వారు ఆసియాకప్ ఆడట్లేదు.
ఇక పాకిస్థాన్ క్రికెట్ జట్టు కూడా సీనియర్ ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగుతోంది. టీ20 ఫార్మాట్కు సెట్ కారని చెబుతూ.. బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్లను ఆ దేశ సెలక్షన్ కమిటీ పక్కనపెట్టింది. దీంతో రెండు జట్లు కూడా యువ ఆటగాళ్లతోనే బరిలోకి దిగినట్లయింది. ఏదిఏమైనా ఆసియాకప్లో పాకిస్థాన్పై భారత్దే పైచేయి. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య ఆసియాకప్లో 18 మ్యాచ్లు జరిగాయి. ఇందులో పదింట్లో టీమిండియా గెలిచింది. ఆరింట్లో పాక్ విజయం సాధించింది. రెండు మ్యాచ్లలో ఫలితం తేలలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa