ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిడ్నీలు పాడైపోయినప్పుడు కనిపించే 6 లక్షణాలు

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 09:44 PM

శరీరంలో పేరుకున్న వ్యర్థాలను సరైన విధంగా బయటకు పంపించడంలో లివర్ తరవాత కిడ్నీలదే కీలక పాత్ర. యూరిన్ ద్వారా మురికిని బయటకు పంపేస్తాయి మూత్ర పిండాలు. అంతే కాదు. రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ, నీటి నిల్వను నియంత్రించడంలోనూ కిడ్నీలు ఎంతో బాగా పని చేస్తాయి. అయితే..కొన్ని సార్లు ఈ పని తీరులో మార్పులు చూస్తారు. అందుకు ముఖ్య కారణం ఇవి దెబ్బ తినడం.


ఎప్పుడైతే కిడ్నీలు దెబ్బ తింటాయో అప్పటి నుంచి టాక్సిన్స్ బాడీలో పేరుకుపోతాయి. సరైన విధంగా మురికి బయటకు వెళ్లిపోదు. ఫలితంగా రకరకాల సమస్యలు వస్తాయి. కిడ్నీలు దెబ్బ తిన్నప్పుడు ప్రాథమికంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని సరైన విధంగా గమనించకపోతే సమస్య తీవ్రమవుతుంది. మరి ప్రాథమికంగా కనిపించే ఆ లక్షణాలేంటి. ఎలా వాటిని గుర్తించాలో తెలుసుకోండి.


కిడ్నీలు డ్యామేజ్


ఇందాకే చెప్పుకున్నట్టుగా కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేసి, టాక్సిన్స్ ని బయటకు పంపుతాయి. వీటి పనే అది. ఎప్పుడైతే ఇందుకు అంతరాయం కలుగుతుందో అప్పుడే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని మెడికల్ పరిభాషలో చెబుతుంటారు. నిజానికి కిడ్నీలు ఉన్నట్టుండి పాడైపోవు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం, మసాలా ఫుడ్స్ అతిగా తినడం లాంటి కారణాల వల్ల మూత్రపిండాల పని తీరుపై ప్రభావం పడుతుంది.


అధికంగా సాల్ట్, ప్రొటీన్ తీసుకున్నా ఇవే ఇబ్బందులు వస్తాయి. అయితే ఇంకొంత మంది విపరీతంగా స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తుంటారు. వీటి వల్ల కిడ్నీలు చాలా త్వరగా డ్యామేజ్ అవుతాయి. ఇక నిద్రలేమి సమస్య కూడా కిడ్నీ డ్యామేజ్ కి దారి తీస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే..ఇదో సైలెంట్ కిల్లర్. ఇక బీపీ, షుగర్ లాంటి వాటి కోసం మెడిసిన్ ఎక్కువ కాలం పాటు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలు దెబ్బ తినే ముప్పు ఉంటుంది. కిడ్నీలో రాళ్లు వస్తాయి.


లక్షణాలు


కిడ్నీలు పాడైపోయినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని సరైన విధంగా, సరైన సమయానికి గుర్తిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇందులో ముఖ్యంగా కనిపించే మొట్టమొదటి లక్షణం ఏంటంటే..తరచూ యూరిన్ రావడం. ఎక్కువ సార్లు మూత్రం రావడం కిడ్నీలు పాడైపోయాయనడానికి సంకేతం. ముఖ్యంగా రాత్రి పూట తరచూ యూరినేషన్ వస్తుంది.


ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అంతకు ముందు రోజులతో పోల్చి చూస్తే మూత్రం చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది. ఇది కూడా కిడ్నీ డ్యామేజ్ కి సంకేతమే. మూత్రంలో ఎక్కువగా నురగ, మరీ పసుపు పచ్చగా రావడం, రక్తం కనిపించడం లాంటి లక్షణాలు కూడా కిడ్నీలు పాడైపోయాయి అనడానికి సంకేతాలే. కిడ్నీలు సరైన విధంగా పని చేయకపోతే శరీరంలో మలినాలు పేరుకుంటాయి. ఇవి బయటకు వెళ్లకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


మలబద్ధకం


ఎప్పుడైతే మూత్ర పిండాలు సరిగ్గా పని చేయవో అప్పుడు బాడీలో టాక్సిన్స్ పెరుగుతాయి. ఇవి నేరుగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. తరచూ వాంతులు, ఆకలి మందగించడం లాంటి లక్షణాలు కనబడతాయి. అంత కన్నా ముఖ్యంగా కనిపించే లక్షణం ఏంటంటే..మలబద్ధకం. ఒక్కసారి ఈ సమస్య మొదలైందంటే..అంత సులభంగా తగ్గదు. పైగా మలబద్ధకం కారణంగా ఇతరత్రా అనారోగ్యాలు కూడా తలెత్తుతాయి. ఇక మరో ముఖ్యమైన లక్షణం ఏంటంటే..ఎప్పుడైతే కిడ్నీలు సరిగ్గా పని చేయవో అప్పుడు బాడీలో ఉన్న అదనపు నీరు, ఉప్పు బయటకు వెళ్లడానికి వీలుండదు. సోడియం పెరిగే కొద్దీ అది కండరాల్లోకి చేరుకుంటుంది. ఎక్కువ రోజుల పాటు అలాగే నిల్వ ఉండడం వల్ల వాపులు వస్తాయి. ముఖ్యంగా చేతులు, కాళ్లలో ఈ వాపు కనిపించవచ్చు. ఉదయం పూట ఈ లక్షణం ఎక్కువగా కనబడుతుంది.


విపరీతమైన నీరసం


కిడ్నీలు పాడైపోయినప్పుడు కనిపించే మరో లక్షణం విపరీతమైన నీరసం. సాధారణంగా మూత్ర పిండాలు ఎరిత్రోపొయిటిన్ అనే హార్మోన్ ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడే హార్మోన్. ఎప్పుడైతే కిడ్నీల పని తీరుపై ప్రభావం పడుతుందో అప్పుడు ఈ హార్మోన్ ఉత్పత్తి కాదు. ఫలితంగా..ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఇదే క్రమంగా అనీమియాకి దారి తీస్తుంది.


అంటే..హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే రక్తం తగ్గిపోతుందో అప్పుడు విపరీతంగా నీరసపడిపోతారు. చాలా మంది దీన్ని మామూలు నీరసంగానే చూస్తారు. కానీ..ఇలా తరచూ నీరసంగా అనిపిస్తోంది అంటే తప్పనిసరిగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంటుంది. కిడ్నీలు పాడైపోయినప్పుడు వెన్ను నొప్పి కూడా వస్తుంది. కిడ్నీలో రాళ్లు రావడం, ఇన్ఫెక్షన్ , ఇన్ ఫ్లమేషన్ కారణంగా ఇలా విపరీతంగా నొప్పి వస్తుంది. మూత్రంలో కూడా మార్పు వస్తే అప్పుడు వైద్యుడిని సంప్రదించడం అవసరం.


ఈ లక్షణాలు కూడా


కిడ్నీలు పాడైపోయినప్పుడు పేరుకుపోయిన టాక్సిన్స్ అన్నీ కేవలం జీర్ణ వ్యవస్థపైనే కాదు. మెదడుపైనా ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా పనిపై ఫోకస్ తగ్గుతుంది. తరచూ తలనొప్పి, నిద్రలేమి, మానసిక ఆందోళన లాంటి లక్షణాలు కూడా కనబడతాయి. వాంతులు, నీరసం, ఆకలి లేకపోవడం లాంటివీ ఇబ్బందికి గురి చేస్తాయి. ఇక కిడ్నీలు పాడైపోవడం వల్ల మినరల్స్, న్యూట్రియెంట్స్ మధ్య బ్యాలెన్స్ తగ్గిపోతుంది. ఫలితంగా చర్మ ఆరోగ్యమూ దెబ్బ తింటుంది. పోషకాల లోపం కారణంగా..చర్మం చాలా పొడిగా మారిపోతుంది. తరచూ దురద వస్తుంది. ఈ లక్షణాలు కనబడితే అప్రమత్తం అవడం మంచిది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa