భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి క్రికెట్ పరిపాలనలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆయన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. ఈ పదవికి దాదా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో గంగూలీ క్యాబ్ అధ్యక్ష పదవికి తన నామినేషన్ పత్రాలను సమర్పించాడు. గడువు ముగిసేసరికి ఆయన మినహా మరెవరూ పోటీలో నిలవలేదు. దీంతో సెప్టెంబర్ 22న జరగనున్న ఎన్నిక కేవలం లాంఛనప్రాయమే కానుంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న తన సోదరుడు స్నేహశిష్ గంగూలీ స్థానంలో సౌరవ్ బాధ్యతలు స్వీకరిస్తాడు.నామినేషన్ అనంతరం గంగూలీ మాట్లాడుతూ, తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. "క్యాబ్లో ఎలాంటి వ్యతిరేకవర్గం లేదు. మేమంతా ఒకటే కుటుంబం. అందరం కలిసికట్టుగా పనిచేసి బెంగాల్ క్రికెట్ను ఉన్నత స్థాయికి తీసుకెళతాం" అని అన్నారు. త్వరలో ఈడెన్ గార్డెన్స్లో భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్, టీ20 ప్రపంచకప్, బెంగాల్ ప్రో టీ20 లీగ్ వంటి ముఖ్యమైన ఈవెంట్లు ఉన్నాయని, వాటిని విజయవంతం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు.గంగూలీ గతంలో 2015 నుంచి 2019 వరకు క్యాబ్ అధ్యక్షుడిగా సేవలందించాడు. ఆ తర్వాత 2019 నుంచి 2022 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా జాతీయ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించాడు. గంగూలీతో పాటు ఉపాధ్యక్షుడిగా నితీశ్ రంజన్ దత్తా, కార్యదర్శిగా బబ్లూ కోలే, సంయుక్త కార్యదర్శిగా మదన్ మోహన్ ఘోష్, కోశాధికారిగా సంజయ్ దాస్ కూడా తమ నామినేషన్లను దాఖలు చేశారు. కాగా, సెప్టెంబర్ 28న ముంబైలో జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశానికి (ఏజీఎం) క్యాబ్ ప్రతినిధిగా కూడా గంగూలీని నామినేట్ చేయడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa