ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు.. ఢిల్లీకి అమెరికా బృందం

national |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 08:04 PM

ప్రపంచ దేశాలపై టారిఫ్ బాంబులు విసిరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ తర్వాత ఆ దేశాలతో వాణిజ్య చర్చలు జరిపి.. ఒప్పందాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే భారత్‌పై మొదట 25 శాతం సుంకాలు వేసిన ట్రంప్.. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు గానూ.. ఆ తర్వాత మరో 25 శాతం అదనపు సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలోనే భారత్‌పై పదే పదే ట్రంప్, ఆయన కార్యవర్గం బెదిరింపులకు దిగుతూనే ఉంది. ఈ క్రమంలోనే భారత్‌తో వాణిజ్య చర్చలు అప్పుడూ, ఇప్పుడూ అని ట్రంప్ కాలయాపన చేస్తున్న తరుణంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రతినిధుల బృందం.. భారత్‌లో అడుగుపెట్టనుంది. రేపట్నుంచి.. భారత్-అమెరికా వాణిజ్య చర్చలు జరగనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.


అమెరికా ప్రధాన మధ్యవర్తి, వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్.. సోమవారం రాత్రికి భారత్‌కు చేరుకోనున్నారు. భారత వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్‌తో బ్రెండన్ లించ్.. చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా.. మధ్యంతర వాణిజ్య ఒప్పందం కోసం.. భారత్, అమెరికాలు చర్యలు జరుపుతూనే ఉన్నాయి. అయితే.. భారత్‌కు వ్యవసాయ, పాల ఉత్పత్తుల రంగాలు చాలా కీలకమైనవి కావడంతో.. వాటిని అమెరికాకు అందుబాటులోకి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారతదేశంలో ఈ రెండు రంగాలు అత్యధిక జనాభాకు ఉపాధి కల్పిస్తుండటంతో.. ఏదైనా నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని నరేంద్ర మోదీ సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తోంది.


ఈ క్రమంలోనే భారత్‌పై అమెరికా సుంకాలు విధిస్తుండగా.. తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే తమ విధానం ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ప్రభుత్వ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. భారత్‌లోని పాల ఉత్పత్తిదారులు, రైతులకు నష్టం కలిగించేలా ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. అదే సమయంలో దానికి ప్రతిఫలంగా ఎలాంటి సమస్య ఎదురైనా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా సుంకాలపై పరోక్షంగా స్పందించారు.


ఈ నేపథ్యంలోనే భారత్, అమెరికా వాణిజ్య చర్చలపై తీవ్ర ప్రతిష్ఠంభన ఎదురైంది. రెండు దేశాల మధ్య వాణిజ్యపరంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. ఇరు దేశాల నాయకులు సానుకూల ధోరణిని అవలంభిస్తున్నారు. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ట్రంప్ అభిప్రాయాలను తాను పూర్తిగా గౌరవిస్తానని.. భారత్-అమెరికా బంధం చాలా బలమైందని గుర్తు చేశారు. ఇక మోదీ మాటలకు స్పందించిన ట్రంప్.. మోదీతో తనకు ఉన్న బంధం చాలా ప్రత్యేకమైందని.. ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైట్ హౌస్‌లో మీడియాకు వెల్లడించారు.


ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైన ఈ వాణిజ్య చర్చల మొదటి దశను.. అక్టోబర్-నవంబర్ నాటికి పూర్తి చేయాలని భారత్, అమెరికా రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జరగనున్న చర్చలు.. ట్రంప్ టారిఫ్‌ల వేళ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాయో చూడాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa