ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిహార్ ఓటర్ల జాబితా సవరణపై తీర్పు దేశం మొత్తానికి వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు

national |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 08:04 PM

బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. బిహార్ ఓటర్ల జాబితా సవరణలో ఏదైనా చట్టవిరుద్ధంగా ఉన్నట్టు గుర్తిస్తే మొత్తం ప్రక్రియను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఓటర్ల జాబితా సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్య బాగ్చిల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. అక్టోబరు 7 చివరి విచారణ చేపడతామని తెలిపింది. చట్టం ప్రకారమే తాము ముందుకెళ్తున్నామని కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. దీనికి ధర్మాసనం స్పందిస్తూ. ఒకవేళ రాజ్యాంగ పరిరక్షణకు భంగం కలిగితే ఈ ప్రకియ చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. బిహార్ ఓటర్ల సవరణపై తాము ఇచ్చే తీర్పు దేశమంతటికీ వర్తిస్తుందని తేల్చిచెప్పింది. ‘‘బీహార్ ప్రత్యేక సవరణపై పాక్షిక అభిప్రాయాన్ని ఇవ్వలేం.. తుది దేశం మొత్తానికి వర్తిస్తుంది’’ అని ఉద్ఘాటించింది.


  అక్టోబర్ 7న జరిగిన విచారణ సందర్భంగా బిహార్‌కు సంబంధించిన అంశాలు, దేశవ్యాప్తంగా ఉన్న SIR ప్రక్రియపై వాదనలు వినిపించడానికి పిటిషనర్లకు కోర్టు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో బిహార్ SIR కోసం 12వ డాక్యుమెంట్‌గా ఆధార్‌ను చేర్చాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశిస్తూ సెప్టెంబర్ 8న ఇచ్చిన ఉత్తర్వులను రీకాల్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నోటీసు జారీ చేసింది. సెప్టెంబర్ 8న ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని, కానీ ఓటరు జాబితాలో చేర్చడానికి సమర్పించినప్పుడు ఈసీఐ దాని ప్రామాణికతగా ధ్రువీకరించవచ్చని సుప్రీం కోర్టు స్పష్టంగా పేర్కొంది.


సోమవారం జరిగిన విచారణ సందర్భంగా, సీనియర్ న్యాయవాది గోపాల్ వాదనలు వినిపిస్తూ.. ‘ఓటర్ల జాబితా సవరణ రాజ్యాంగ విరుద్దమైన ప్రక్రియ అయితే కొనసాగకూడదని ఒత్తిడి చేసే హక్కు మాకు ఉంటుంది.. చట్టాన్ని ఈసీ కూడా వినాలి... ప్రస్తుతం బిహార్‌లో 7.89 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు... 4.96 కోట్ల మందిని డ్రాఫ్ట్ రోల్‌లో చేర్చారు.. ఆధార్ ఉన్నవారు 6.84 కోట్ల మంది ఉన్నట్లు అంచనా’ అని తెలిపారు. బిహార్ ఓటర్ల జాబితా సవరణ విషయంలో ఈసీని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తోన్న విషయం తెలిసిందే.


రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన ఈసీ.. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఈసీపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తూ.. ఓట్ చోరీకి పాల్పడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీడియా సమావేశం ఏర్పాటుచేసి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అటు, బిహార్‌లో ఓటర్ అధికార్ యాత్రను కొనసాగిస్తూ ప్రజల్లోకి దీనిని బలంగా తీసుకెళ్తున్నారు. ఈసీ మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa