ట్రెండింగ్
Epaper    English    தமிழ்

16 ఏళ్ల బాలుడిపై రెండేళ్లుగా 14 మంది లైంగిక దాడి, 9 మంది అరెస్ట్

Crime |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 07:50 PM

సాధారణంగా మహిళలపై మాత్రమే అత్యాచారాలు జరుగుతాయని చాలా మంది భావిస్తుంటారు. పసిపిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఎవరు కనిపించినా కామాంధులు వదలని భావిస్తుంటారు. ఇది నిజమే అయినప్పటికీ.. పురుషులపై కూడా అఫ్పుడప్పుడూ అత్యాచారాలు జరుగుతుంటాయి. చాలా తక్కువగా వెలుగులోకి ఇలాంటి ఘటనలు వస్తుండగా.. తాజాగా కేరళలో ఇలాంటి ఘోరమే జరిగింది. ఓ 16 ఏళ్ల బాలుడిపై 14 మంది పురుషులు.. రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ఇప్పటికే 9 మందిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే నిందితుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులందరూ ఎల్‌జీబీటీక్యూ వర్గానికి చెందిన వారి కోసం ప్రత్యేకంగా ఉన్న ఒక మొబైల్ యాప్ ద్వారా బాలుడితో స్నేహం పెంచుకున్నారు. మొదట మంచి మాటలతో నమ్మకం కల్పించి.. ఆ తర్వాత బాలుడి బలహీనతలను ఆసరాగా తీసుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ అఘాయిత్యం బాలుడి ఇంటితో పాటు కన్నూర్, కోజికోడ్ జిల్లాలతో సహా అనేక ప్రదేశాలలో రెండు సంవత్సరాల పాటు కొనసాగింది. మొత్తంగా 14 మంది తమకు ఇష్టం వచ్చినప్పడుల్లా బాలుడిపై అత్యాచారం చేశారు. విషయం ఎవరికైనా చెబితే.. చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. దీంతో సదరు బాలుడు రెండేళ్లుగా నరకం అనుభవిస్తూ.. వారి చెప్పినట్లే నడుచుకున్నాడు.


కానీ అదృష్టవశాత్తు ఓ రోజు బాలుడి తల్లి ఈ విషయం గుర్తించింది. ముఖ్యంగా ఓ నిందితుడు నేరుగా బాలుడి ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో బాలుడి తల్లి ఇంట్లోకి రాగా.. ఈ ఘటన ఆమె కంట పడింది. దీంతో నిందితుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో అనుమానం వచ్చిన తల్లి బాలుడిని ప్రశ్నించగా.. జరిగిన విషయం మొత్తం చెప్పాడు. తనకు జరుగుతున్న అన్యాయం గురించి వివరిస్తూనే విపరీతంగా ఏడ్చాడు. దీంతో బాలుడిని ఓదార్చిన తల్లి ఆపై.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ముఖ్యంగా బాలుడు చెప్పిన ఆధారాలతో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండడం ఈ కేసులో మరో సంచలన అంశంగా నిలిచింది. అయితే మిగతా ఐదుగురు నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వివరించారు. ఈ దారుణానికి పాల్పడిన వారందరినీ చట్ట ప్రకారం శిక్షించి.. బాధితుడికి న్యాయం చేకూర్చేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు నెట్టింట ఈ వార్త వైరల్ అవుతుండగా.. పిల్లల తల్లిదండ్రులకు అనేక సూచనలు చేస్తున్నారు. పిల్లలు ఎలా ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, సెల్‌ఫోన్‌లో ఏమేం చూస్తున్నారు వంటివన్నీ ఓ కంట కనిపెడుతూ ఉండాలని వివరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa