అస్సాం రాష్ట్రంలో అవినీతిపై ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్ దాడులు ముమ్మరం చేసింది. ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నారని, అక్రమ భూ బదిలీలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అస్సాం సివిల్ సర్వీస్ (ACS) అధికారిణి నూపుర్ బోరాను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఈమె ఇంట్లో సోదాలు నిర్వహించగా.. రెండు బ్యాగుల నిండా ఉన్న నోట్ల కట్టలు, బంగారం కనిపించాయి. దీంతో వాటిని వెంటనే స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ వలసదారులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన డ్రైవ్లో ఈ అధికారిణి ప్రమేయం ఉన్నట్లు తేలడం సంచలనం సృష్టిస్తోంది. కేవలం ఆరు సంవత్సరాల సర్వీసులోనే ఆమె ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టడం గమనార్హం.
ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్కు చెందిన అధికారులు.. గౌహతిలోని గోతా నగర్ ప్రాంతంలోని బోరాకు చెందిన రెండు అపార్ట్మెంట్లపై దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు రూ.1 కోటి నగదుతో పాటు మరో కోటి రూపాయల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు లభించాయని ఎస్పీ రోసీ కలితా తెలిపారు. 2019 బ్యాచ్కు చెందిన ఏసీఎస్ అధికారిణి అయిన బోరా.. ప్రస్తుతం కామరూప్ జిల్లాలోని గోరైమారిలో సర్కిల్ అధికారిగా పని చేస్తున్నారు.
ఆమెపై వచ్చిన ఆరోపణలపై గత ఆరు నెలలుగా తమ నిఘా ఉందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు, నగదు కూడబెట్టారన్న ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నామని చెప్పారు. బార్పేటలో పని చేసిన సమయంలో ఆమె అక్రమ భూ బదిలీలకు పాల్పడ్డారని.. హిందువుల భూమిని మరొక వర్గానికి బదిలీ చేశారని ఆరోపించారు. మైనార్టీ ఆధిపత్య ప్రాంతాల్లోని రెవెన్యూ సర్కిళ్లలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ఈ సంఘటనకు రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది. నూపుర్ బోరా కేసులో వెలుగులోకి వచ్చిన భూ బదిలీల వ్యవహారం, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అనుమానిత వలసదారులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు బలాన్ని చేకూర్చింది. ఇటీవల అంతర్-మత భూ లావాదేవీలన్నింటికీ అస్సాం పోలీసుల స్పెషల్ బ్రాంచ్ అనుమతి తప్పనిసరి చేస్తూ రాష్ట్ర కేబినెట్ ఒక నూతన విధానాన్ని ఆమోదించింది. జనాభా మార్పులు, జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గత వారాంతంలో అస్సాం పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా అక్రమ వలసదారుల వల్ల రాష్ట్ర జనాభాకు ముప్పు ఉందని అన్నారు.
నూపుర్ బోరా సోషల్ మీడియా ఖాతాలు పరిశీలిస్తే.. ఆమె ఎంతటి విలాసవంతమైన జీవితం గడుపుతుందో తెలుస్తుందని విజిలెన్స్ సెల్ ఎస్పీ అన్నారు. గౌహతిలోని గోతానగర్ ప్రాంతంలో ఆమెకు రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయని తెలిపారు. బోరాతో పాటు ఆమెకు సహకరించిన సూరజిత్ దేకా అనే మరో వ్యక్తి ఇంటిపైనా సోదాలు నిర్వహించామన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని.. ఆమెపై మరిన్ని ఆరోపణలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. దర్యాప్తు ముగిసే సమయానికి మరింత డబ్బు, బంగారం, ఆస్తులు లభించే అవకాశం ఉందని ఎస్పీ రోసీ కలితా తెలిపారు. ఇది విజిలెన్స్ సెల్లో నమోదైన 25వ కేసు అని కూడా ఆమె చెప్పారు. ఈ సంఘటన రాష్ట్ర బ్యూరోక్రసీలో ఉన్న అవినీతిని మరోసారి బయటపెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa