ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులకు సంబంధించి ప్రతి విషయంపై అవగాహన ఉండడం ట్యాక్స్ పేయర్లకు చాలా అవసరం. ఐటీఆర్ దాఖలు చేయడంతోనే పని పూర్తి కాదు. దానిని ఇ-వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నుల గడువును ప్రభుత్వం ఇప్పటికే ఒకసారి పొడిగించగా పలు కారణాలతో మరో రోజు అవకాశం ఇస్తూ సెప్టెంబర్ 15 నుంచి 16వ తేదీ వరకు గడువు ఇచ్చింది. చివరి నిమిషంలో ఐటీఆర్ దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న చాలా మంది ట్యాక్స్ పేయర్లకు ఈ నిర్ణయం ఉపశమనం కల్పిస్తుందని చెప్పవచ్చు. అయితే, ట్యాక్స్ పేయర్లు తమ రిటర్నులు ఫైల్ చేయడంతోనే గడువు పూర్తవుతుంది కదా గడువు ముగిశాక ఇ-వెరిఫై చేయొచ్చా అనే అయోమయంలో పడిపోయారు. గడువులోపే వెరిఫై సైతం చేయాలేమో అని ఆందోళన పడుతున్నారు.
ఇన్కమ్ ట్యాక్స్ విభాగం అధికారిక లెక్కల ప్రకారం సెప్టెంబర్ 15, 2025 నాటికి మొత్తం 7,08,89,145 ఐటీ రిటర్నులు ఫైల్ అయ్యాయి. అందులో 6,23,03,847 రిటర్నులు ఇ- వెరిఫై పూర్తి చేశారు. అంటే 86 శాతం ఐటీఆర్లు మాత్రమే వెరిఫై పూర్తయ్యాయి. ఇంకా 85,85,298 ఐటీ రిటర్నులను వెరిఫై చేయాల్సి ఉంది. దీంతో పాటు సెప్టెంబర్ 16వ తేదీ వరకు గడువు ఇవ్వడంతో ఈరోజు సైతం భారీగానే రిటర్నులు ఫైల్ కావచ్చు. అవి సైతం వెరిఫై పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో లక్షల మంది ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
30 రోజుల వరకు ఛాన్స్
ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల ప్రకారం ఐటీఆర్ ఫైలింగ్ చేసిన తర్వాత దానిని ఇ-వెరిఫై చేసేందుకు 30 రోజుల సమయం ఉంటుంది. అంటే ఐటీఆర్ ఫైల్ చేసిన రోజు నుంచి 30 రోజుల్లోగా పూర్తి చేయాలి. ఇచ్చిన 30 రోజుల్లోగా పూర్తి చేస్తే ఫైల్ చేసిన తేదీని లెక్కలేకి తీసుకుంటారు. ఆ తర్వాత వెరిఫై చేస్తే వెరిఫై చేసిన తేదీనే పరిగణిస్తారు. అప్పుడు బిలేటెడ్ ఐటీఆర్ (లేటుగా ఐటీఆర్ ఫైల్ చేయడం)గా అవుతుంది. దీంతో పెనాల్టీలు, వడ్డీలు కట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం సెప్టెంబర్ 16వ తేదీ అర్ధరాత్రి వరకు ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఆ తర్వాత 30 రోజుల వరకు అంటే అక్టోబర్ 15వ తేదీ వరకు ఇ-వెరిఫై చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆలోపు పూర్తి చేస్తే ఎలాంటి పెనాల్టీలు, వడ్డీలు ఉండవు. కానీ, ఇచ్చిన సమయం దాటితే మాత్రం రూ.5 వేల వరకు పెనాల్టీతో పాటు నెల నెలా వడ్డీ కట్టాల్సి వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa