ట్రెండింగ్
Epaper    English    தமிழ்

IND vs AUS: బుమ్రా దెబ్బలు మరిచిపోయేలా.. తొలి మ్యాచ్‌లోనే అద్భుత శతకం!

sports |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 11:27 PM

భారత పర్యటనను ఆస్ట్రేలియా-ఏ జట్టు విజయవంతంగా ఆరంభించింది. భారత్-ఏతో జరుగుతున్న రెండు అనధికారిక టెస్టులలో భాగంగా మంగళవారం లక్నోలో ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో ఆసీస్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది.యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (144 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 109) తన తొలి భారత పర్యటనలోనే సెంచరీతో మెరిశాడు. మ్యాచ్ తొలి రోజు ముగిసే సమయానికి ఆసీస్-ఏ జట్టు 73 ఓవర్లలో 5 వికెట్లకు 337 పరుగులు చేసింది. అతనికి మద్దతుగా ఓపెనర్ కాంప్‌బెల్ కెల్లవే (97 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 88), కూపర్ కన్నోల్లీ (84 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సుతో 70) అర్ధశతకాలతో రాణించారు.ప్రస్తుతం క్రీజులో లియామ్ స్కాట్ (79 బంతుల్లో 47 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సులు), జోష్ ఫిలిప్ (3 నాటౌట్) ఉన్నారు. భారత్-ఏ బౌలర్లలో హర్ష్ దూబే 3 వికెట్లు (3/88) తీసుకోగా, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్ చెరో వికెట్‌ పడగొట్టారు. ప్రసిద్ కృష్ణ 11 ఓవర్లు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ తీసుకోలేకపోయాడు.భారత్-ఏ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నాడు. అతనితో పాటు అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, ఖలీల్ అహ్మద్ వంటి ప్రముఖులు జట్టులో ఉన్నారు. రెండో టెస్టు కోసం కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ అందుబాటులోకి రానున్నారు. ఈ రెండు టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో అవకాశాలు దక్కే అవకాశం ఉంది.టాస్ గెలిచిన ఆసీస్-ఏ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఆసీస్ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆట సాగించారు. ఓపెనర్లు సామ్ కొన్‌స్టాస్, కాంప్‌బెల్ కలిసి తొలి వికెట్‌కు 198 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. హర్ష్ దూబే సామ్‌ను బౌల్డ్ చేయగా, కాంప్‌బెల్‌ను గుర్నూర్ బ్రార్ క్యాచ్‌ఔట్‌ చేశారు. కెప్టెన్ నాథన్ మెక్‌స్వామి (1), ఒలివర్ పీక్ (2)లు త్వరగా వెనుదిరిగినా, కూపర్ కన్నోల్లీ – లియామ్ స్కాట్ జోడీ నాలుగో వికెట్‌కు 109 పరుగులు జోడించారు. సెంచరీ దిశగా సాగుతున్న కూపర్‌ను హర్ష్ దూబే ఔట్‌ చేశాడు. అనంతరం లియామ్ స్కాట్, జోష్ ఫిలిప్ కలిసి రోజు ముగిసే వరకూ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడారు. మొత్తం 73 ఓవర్ల ఆట మాత్రమే మొదటి రోజు సాధ్యమైంది.గతేడాది డిసెంబర్‌లో మెల్‌బోర్న్ వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో జరిగిన నాలుగో టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం చేసిన సామ్ కొన్‌స్టాస్, అప్పుడే తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఆ మ్యాచ్‌లో వరల్డ్ క్లాస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై అతని దూకుడు ప్రత్యేకంగా నిలిచింది. బుమ్రా బౌలింగ్‌లో సామ్ కొన్‌స్టాస్ సిక్స్ బాదడం 4,483 బంతుల తర్వాత జరిగిన అరుదైన సంఘటన. ఆ మ్యాచ్‌లో కొన్‌స్టాస్ 52 బంతుల్లోనే అర్ధశతకం నమోదు చేశాడు. ఇప్పుడు భారత్-ఏపై తన తొలి మ్యాచ్‌లోనే మరోసారి అద్భుత శతకం నమోదు చేసి ఆసక్తికరంగా నిలిచాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa