ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలెక్టర్ల సదస్సులో ఆసక్తికర సీన్,,,వెంటనే ఓకే చెప్పిన సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 17, 2025, 05:56 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండు రోజుల పాటూ కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. అయితే రెండో రోజు పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలపై నిర్వహించిన సమీక్షలో ఆసక్తికర చర్చ జరిగింది. అభివృద్ధి చెందుతున్న పట్టణాల సమీపంలో ఉండే పంచాయితీలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే కొన్ని చోట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు లేవు కాబట్టి ప్లానింగ్ కష్టం అవుతుంది అన్నారు. వెంటనే ఈ అంశంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పంచాయతీరాజ్‌‌శాఖ దీనిపై ఇప్పటికే కసరత్తు చేస్తోందన్నారు.. పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ త్వరలోనే మేజర్ పంచాయితీలలో కూడా కంట్రీ ప్లానింగ్ అథారిటీ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన సిద్ధం చేశామన్నారు.


'పంచాయతీ గ్రేడింగ్‌లలో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నాం.. మండల హెడ్ క్వార్టర్‌లను మినిమిం గ్రేడ్ 1, స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా చేయాలనుకుంటున్నాము. అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ టౌన్ ప్లానింగ్‌కు సపోర్ట్ చేస్తుందో.. అలా ఒక వింగ్ పెట్టుకుని సాయం చేద్దామని ప్లాన్ చేశాము.. ఇలా మొత్తం 250వరకు వచ్చే అవకాశం ఉంది' అని వివరించారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఐడియా బావుందని.. పట్టణాల మాదిరిగా ‘రూర్బన్‌ మిషన్‌’ విధానంలో గిరిజన ప్రాంతాలు, జనాభా ఎక్కువ ఉన్న మేజర్‌ పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.


రాష్ట్రంలో చెత్త సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రణాళికను రూపొందించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్రంలో ఎక్కడా వ్యర్థాలు కనిపించకూడదని ఆయన స్పష్టం చేశారు. వీధుల్లో చెత్త కుప్పలు కనిపిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు భారం కాకుండా చెత్త పన్నును రద్దు చేశామని ఆయన తెలిపారు. ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలని, రాష్ట్రం ఒక ఆదర్శవంతమైన సమాజంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. పరిశుభ్రత అంటే కేవలం శుభ్రం చేయడమే కాదని, ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలన్నారు. సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాల గురించి తెలుసుకున్నానని.. దాని ద్వారా హైదరాబాద్‌లో నైట్ క్లీనింగ్ ప్రారంభించామని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ నగరంగా అభివృద్ధి చేశామని.. తర్వాత పరిశుభ్రత-పచ్చదనం కార్యక్రమం అమలు చేశామన్నారు.


చాలామంది తమ ఇంటిలోని చెత్తను రోడ్లపై వేస్తారని, ఇల్లు తమదైనా రోడ్డు వేరే వారిదన్నట్లుగా ప్రవర్తిస్తారన్నారు నారా చంద్రబాబు నాయుడు . అలాంటి వారిలో మార్పు తీసుకువచ్చామని..మురుగు కాలువల్లో చెత్త వేయడం వల్ల వర్షం వచ్చినప్పుడు ఆ చెత్త రోడ్లపైకి వచ్చేదని, దానిని కూడా కొంతవరకు నియంత్రించామన్నారు. రాష్ట్రంలో సర్క్యులర్ ఎకానమీలో భాగంగా ఐదు జోన్లలో పార్కులు ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు ఒక గడువు పెట్టుకొని పనులు పూర్తి చేయాలని అన్నారు. గ్రామాల్లో 82% సిమెంట్ రోడ్లు పూర్తయ్యాయని చెప్పారు. వర్షపు నీటిని భూమిలో ఇంకింపజేసే మ్యాజిక్ డ్రెయిన్ విధానం చాలా మంచిదని, ఇది సిమెంట్ కాలువల నిర్మాణానికి అయ్యే ఖర్చులో ఏడు రెట్లు తగ్గిస్తుంది అన్నారు. ఈ విధానాన్ని బాగా అమలు చేస్తే ద్రవ వ్యర్థాల సమస్యను అధిగమించవచ్చునని సీఎం అన్నారు. పట్టణాల్లో ఘన వ్యర్థాలు శుద్ధి చేసే ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి కలెక్టర్ స్థలాలు కేటాయించాలని సూచించారు. విద్యార్థులు తీసుకొచ్చిన ‘గ్రీన్ పాస్‌పోర్ట్’ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలన్నారు. మ్యాజిక్ డ్రెయిన్ విధానం వల్ల నీటిని భూమిలోకి పంపించవచ్చన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa