కెనడాలోని ఖలిస్థానీ సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ మరోసారి రెచ్చిపోయింది. ముఖ్యంగా వాంకోవర్లోని భారతీయ దౌత్య కార్యాలయాన్ని సీజ్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడింది. సెప్టెంబర్ 18వ తేదీన భారత కాన్సులేట్ను ముట్టడించి స్వాధీనం చేసుకుంటామని సదరు సంస్థ ప్రకటించింది. సిక్కు తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు జవాబుదారీగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
సోషల్ మీడియా వేదికగా సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ ఈ బెదిరింపులకు పాల్పడింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ పోస్టులో.. సెప్టెంబర్ 18వ తేదీన భారత కాన్సులేట్ను ముట్టడించబోతున్నట్లు చెప్పింది. ఆ సమయంలో ఇక్కడికి ఎవరూ రావొద్దని కూడా తెలిపింది. అంతేకాకుండా భారత హైకమిషనర్ దినేశ్ కె. పట్నాయక్ను లక్ష్యంగా చేసుకుని ఉన్న పోస్టర్లను కూడా విడుదల చేసింది. దీంతో ఇది కాస్తా అంతర్జాతీయ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ తాజా బెదిరింపులు కెనడా ప్రభుత్వం చేసిన ఒక కీలక ప్రకటన తర్వాత వెలువడటం గమనార్హం. కెనడా ఆర్థిక శాఖ విడుదల చేసిన ఒక నివేదికలో ఖలిస్థానీ తీవ్రవాద గ్రూపులకు కెనడా నుంచే ఆర్థిక సహాయం అందుతోందని మొదటి సారిగా అంగీకరించింది. ‘ది 2025 అసెస్మెంట్ ఆఫ్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్స్’ పేరుతో విడుదలైన ఈ నివేదిక.. కెనడా గడ్డపై స్వేచ్ఛగా పని చేస్తున్నాయని ఎప్పటి నుంచో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖలిస్థానీ సంస్థల టెర్రర్ ఫైనాన్సింగ్పై హెచ్చరికలు జారీ చేసింది.
అనేక సంవత్సరాలుగా.. బాబర్ ఖల్సా ఇంటర్నేషనల్ , ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ వంటి సంస్థలకు కెనడాలో సురక్షిత ఆశ్రయం లభిస్తుందని భారత్ వాదిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు ఒట్టావా ప్రభుత్వం ఈ సంస్థలు, అలాగే హమాస్, హిజ్బుల్లా వంటి ఇతర ఉగ్రవాద సంస్థలు కూడా తమ తీవ్రవాద ఎజెండా కోసం కెనడియన్ ఫండింగ్ నెట్వర్క్లు, స్వచ్ఛంద సంస్థలు, లాభాపేక్షలేని సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని అంగీకరించింది.
కెనడాలోని భారతీయ దౌత్య కార్యాలయాలపై ఖలిస్థానీ మద్దతుదారుల నుంచి తరచుగా ఎదురవుతున్న బెదిరింపులు, దాడులు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి. నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో భారత దౌత్యవేత్తలు, భారతీయ ప్రజల భద్రతకు కెనడా ప్రభుత్వం భరోసా కల్పించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa