ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్ 22 తర్వాత.. సబ్బులు, బిస్కెట్లు, కిరాణా సామగ్రి.. ఏది కొన్నా ఈ పని మర్చిపోవద్దు

business |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 10:38 PM

 గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ)లో భారీ మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. పన్ను శ్లాబులను రెండుకు పరిమితం చేసింది. ఇకపై 5, 18 శాతం పన్ను శ్లాబులు మాత్రమే ఉండనున్నాయి. దీంతో చాలా రకాల వస్తువుల ధరలు ఒక్కసారిగా దిగివస్తాయి. ఈ మార్పులు సెప్టెంబర్ 22, 2025 నుంచే అమలులోకి వస్తున్నాయి. అప్పటి నుంచి ధరలు తగ్గుతాయని అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజలపై అధికంగా ఉంటుంది. సబ్బులు, షాంపులు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడం ద్వారా వారిపై భారం తగ్గనుంది. అయితే, అది అంత సులభమేమీ కాదని విశ్లేషకులు అంటున్నారు. కొత్త ఎంఆర్‌పీ (MRP)తో వస్తువులు మార్కెట్లోకి వచ్చేందుకు చాలా సమయం పడుతుందని అంటున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 22వ తేదీ తర్వాత ఏ వస్తువు కొన్నా ఓ పని చేయాలంటున్నారు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.


ప్రధానంగా ప్యాకింగ్ చేసిన వస్తువులు కొనుగోలు చేస్తున్నప్పుడు వినియోగదారులు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను సవరించడంతో స్థానిక దుకాణాల్లో కొంత గందరగోళం తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సెప్టెంబర్ 22కు ముందు తయారై ప్యాకింగ్ చేసిన వస్తువులపై కొత్త ఎంఆర్‌పీతో స్టిక్కర్లు అతికించేందుకు అనుమతించింది. అయితే, పాత ఎంఆర్‌పీ కనిపించేలా ఉండాలని స్పష్టం చేసింది. అంటే పాత, కొత్త ఎంఆర్‌పీ ధరలు వస్తువుపై కనిస్తాయి. దీంతో అయోమయానికి గురికాకుండా కొత్త ధర ఏది, ఎంత మేర తగ్గింది అనే విషయాన్ని గుర్తించాలి. లేదంటే కొందరు దుకాణదారులు పాత ధరలకే విక్రయించి అదనంగా వసూలు చేసే ప్రమాదం ఉంటుంది.


సెప్టెంబర్ 22 తర్వాత మారిన ధరల కు సంబంధించి పత్రికల్లో ప్రకటన ఇవ్వాలన్న ఆదేశాలను సవరించింది కేంద్రం. అందుకు బదులుగా కొత్త ధరల జాబితాను డీలర్లు, రిటైలర్లకు అందించి వాటి ప్రకారం కొత్త రేట్లతో స్టికర్లు వేయాలని తెలిపింది. పాత ప్యాకేజింగ్ స్టాక్ పై ధరలు మార్చి విక్రయించుకునేందుకు మార్చి 31, 2026 వరకు అవకాశం కల్పించింది. లేదా స్టాక్ అయిపోయేంత వరకు ఈ సేవలు కొనసాగించవచ్చు. అంటే కొత్త ఎంఆర్‌పీతో కొత్త వస్తువులు మార్కెట్లోకి వచ్చే వరకు పాత వస్తువులే ఉంటాయి. వాటిపై కొత్త రేట్లతో స్టిక్కర్లు ఉంటాయి. వాటిని గుర్తించగలిగినప్పుడే జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు అందుతుందని చెప్పవచ్చు.


జీఎస్టీ కొత్త పన్ను శ్లాబుల ప్రకారం 5 శాతం లేదా 18 శాతం మాత్రమే ఉంటుంది. సెప్టెంబర్ 22వ తేదీ తర్వాత తయారు చేసే వస్తువులు, దిగుమతి చేసుకునే వస్తువులపై కొత్త ఎంఆర్‌పీ ముద్రించాల్సి ఉంటుంది. అయితే, మందులు, మెడికల్ సామగ్రికి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. పాత వస్తువులు, ఔషధాలపై ఎంఆర్‌పీ మార్చడం తప్పనిసరి ఏం కాదు. కానీ, కొత్త స్టిక్కర్లు, ముద్రలు వేసి విక్రయించవచ్చు. అయితే, పాత ఎంఆర్‌పీ రేట్లు కనిపించాలి. కొత్త ధరలు తగ్గినట్లు స్పష్టంగా కనిపించాల్సి ఉంటుంది.


వినియోగదారులు బిల్లులు చెల్లించేటప్పుడు బిల్లు అడిగి తీసుకుని అందులో కచ్చితంగా చెక్ చేయాలి. పాత ధర వేశారా లేదా కొత్త ధర వేశారా? చూడాలి. పాత ధర వేసినట్లయితే ప్రశ్నించాలి. కొత్త ధరతో మాత్రమే కొనుగోలు చేయాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. పాత్ స్టాక్‌ను కొత్త రేట్లతోనే విక్రయించాలి. పాత స్టాక్ కదా అని పాత ధరతో విక్రయిస్తామంటే కుదరదు. తగ్గిన జీఎస్టీ రేట్ల ప్రకారమే ధర ఉండాలి. ఈ విషయాలను కొనుగోలుదారులు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa