ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కొక్కరికి ఏడాదికి రూ.20 లక్షలు.. విద్యార్థులకు ఎస్‌బీఐ వరాలు

business |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 10:43 PM

పేద విద్యార్థులకు ఎస్‌బీఐ ఫౌండేషన్ అదిరే శుభవార్త చెప్పింది. చదువుల్లో విశేష ప్రతిభ కనబరిచే పేద విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ (Platinum Jubilee Asha Scholarship 2025) ప్రకటించింది. ఈ ఏడాది 2025కి సంబంధించిన స్కాలర్‌షిప్ పై ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా 23,230 మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ అందిస్తామని తెలిపింది. ఒక్కొక్కరికి రూ.20 లక్షల వరకు అందించనుంది. విద్యార్థుల విద్యార్హతను బట్టి ఈ స్కాలర్‌షిప్ రేంజ్ ఉంటుంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.


ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 23,230 ప్రతిభావంతులైన స్టూడెంట్స్‌ను ఎంపిక చేసి ఈ స్కాలర్‌షిప్ అందించనున్నారు. విద్యార్థుల చదువులకు బాసటగా నిలవడం ద్వారా భావి భారత నిర్మాతలను తీర్చిదిద్దనున్నట్లు ఎస్‌బీఐ ఫౌండేషన్ పేర్కొంది. పేద విద్యార్థులకు అండగా నిలిచే ప్రయత్నంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లో స్కాలర్ షిప్ కోసం రూ. 90 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. గొప్ప ఆశయంతో ఈ ఆశా స్కాలర్‌షిప్‌ను 2022లో ప్రారంభించినట్లు ఎస్‌బీఐ ఫౌండేషన్ తెలిపింది. ఈ కార్యక్రమంపై ఎస్‌బీఐ ఛైర్మన్ సీ. శ్రీనివాసులు శెట్టి మాట్లాడారు. 'ఈ సంవత్సరం ఎస్‌బీఐ ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు జరుపుకోనుంది. ఈ క్రమంలో అదే పేరుతోనే స్కాలర్ షిప్ ప్రారంభించడం గర్వకారణం. 23,230 మంది పేద విద్యార్థులకు మేలు కలగనుంది. ఉన్నత చదువులు చదువుకోవాలన్న ఆకాంక్ష నెరవేరనుంది.' అని అన్నారు.


9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పేద విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ ఇస్తారు. ఎంపిక చేసుకున్న కోర్స్ పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం రూ.15 వేల నుంచి రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. అర్హులైన విద్యార్థులు నవంబర్ 15వ తేదీ లోపు www.sbiashascholarship.co.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్కూల్ స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయెట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, మెడికల్ విద్యార్థులు, ఐఐటీ, ఐఐఎం స్టూడెంట్స్ సహా ఓవర్సీస్ విద్యార్థులూ అప్లై చేసుకోవచ్చు.


కోర్సు, వారి అధ్యయన స్థాయి ప్రకారం రూ.15 వేల నుంచి రూ.20 లక్షల వరకు ఇస్తారు. ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాలి. అయితే కనీస అర్హత సాధించాల్సి ఉంటుంది. స్కాలర్ షిప్ రావాలంటే గత ఏడాదిలో 75 శాతం మార్కులు లేదా 7 సీజీపీఏ సాధించాలి. కుటుంబ ఏడాది ఆదాయం స్కూల్ విద్యార్థులకు రూ.3 లక్షలు, ఇతర కేటగిరీలకు రూ.6 లక్షలుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 10 శాతం సడలింపు ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa