ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓవైపు భారత్-పాక్ మ్యాచ్, మరోవైపు ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్

international |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 10:03 PM

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్థాన్ వైఖరి మరోసారి బట్టబయలైంది. సెప్టెంబర్ 14వ తేదీన దుబాయ్‌లో జరిగిన భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌కు కేవలం 7 గంటల ముందు, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో రహస్యంగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.


ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత సైన్యం జరిపిన మెరుపు దాడుల్లో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం ధ్వంసమై భారీగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడుల్లో ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్‌కు చెందిన 10 మంది కుటుంబ సభ్యులు, అతని సోదరుడు యూసఫ్ కూడా మరణించారు. భారత్ చర్యలతో జైషే మహమ్మద్ కకావికలం అయిపోయింది. దీంతో కొత్త ఉగ్రవాదులను నియమించుకోవడానికి ఈ డ్రైవ్ నిర్వహించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.


 ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను మతపరమైన సమావేశం పేరుతో నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పాకిస్థన్ సైన్యం సహా స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ ఈ సమావేశంలో కీలక ప్రసంగం చేస్తూ.. భారత్ చేసిన దాడిలో తమకు జరిగిన నష్టాన్ని గుర్తు చేసుకున్నాడు. ఉగ్రవాదాన్ని స్వీకరించి, పాక్ దేశ సరిహద్దులను కాపాడటానికి.. ఢిల్లీ, కాబూల్, కాందహార్‌లతో పోరాడామని.. అన్నింటినీ త్యాగం చేసిన తర్వాత, మే 7న భారత బలగాలు బహవల్పూర్‌లో మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని అంతం చేశాయని ఆయన భావోద్వేగంతో మాట్లాడినట్లు నిఘా వర్గాల సమాచారం.


ప్రస్తుతం జైషే మహమ్మద్ తన కార్యకలాపాలకు సులభంగా నిధులు సేకరించుకోవడానికి, అంతర్జాతీయ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి తన పేరును అల్-మురాబితున్‌గా మార్చుకుంది. అరబిక్ భాషలో దీనర్థం ఇస్లాం సంరక్షకులు అని. పాకిస్థాన్ సైన్యం, ప్రభుత్వ సహకారంతో ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించడానికి జైషే ప్రయత్నిస్తున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. అలాగే మసూజ్ అజార్ సోదరుడు యూసఫ్‌కు స్మారక చిహ్నాన్ని పెషావర్‌లో నిర్మించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa