శ్రీలంక యువ క్రికెటర్ దునిత్ వెల్లలాగే .. తండ్రి మరణించిన రెండు రోజులకే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కోసం బరిలోకి దిగాడు. ప్రస్తుతం ఆసియాకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు దునిత్. అయితే అప్ఘానిస్థాన్తో మ్యాచ్ ముగిసిన వెంటనే అతడికి ఓ షాకింగ్ విషయం తెలిసింది. మ్యాచ్ జరుగుతుండగానే అతడి తండ్రి సురంగ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ విషయాన్ని మ్యాచ్ జరుగుతుండగా.. అతడికి తెలియనీయలేదు.
మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంక హెడ్ కోచ్ సనత్ జయసూర్య.. సురంగ వెల్లలాగే చనిపోయిన విషయాన్ని దునిత్ వెల్లలాగేకు చెప్పాడు. ఆ వార్త వినగానే, తన చుట్టూ ఉన్న ప్రపంచన్నంతా ఒక్కసారిగా కోల్పోయినట్లు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు దునిత్. తండ్రి తలుచుకుని అతడు భావోద్వేగానికి గురయ్యాడు. ఈనెల 18న ఇది జరిగింది. అయితే మ్యాచ్ ముగిసిన గంట తర్వాత దునిత్.. అబుదాబీ ఎయిర్పోర్టు నుంచి శ్రీలంకకు వెళ్లిపోయాడు.
ఇక ఈనెల 19న అంటే.. శుక్రవారం అతడు తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. కొడుకుగా తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. అయితే ప్రస్తుతం విషాదంలో ఉన్న దునిత్.. ఆసియాకప్ 2025లో మళ్లీ ఆడతాడా లేదా అన్న సందేహం తలెత్తింది. కానీ అతడు మాత్రం.. దేశం ముఖ్యమని చాటి చెబుతూ.. తండ్రి అంత్యక్రియలు పూర్తయిన మరుసటి రోజే ఆసియాకప్ కోసం బయలుదేరాడు. దుబాయ్ ఫ్లైట్ ఎక్కాడు. సూపర్-4లో బంగ్లాదేశ్తో మ్యాచులో అతడు బరిలోకి దిగాడు.
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు.. శ్రీలంక క్రికెటర్లు.. దునిత్ వెల్లలాగే తండ్రికి నివాళి అర్పించారు. శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ ఆటగాళ్లు సైతం సురంగ ఆత్మకు శాంతి చేకూరాలని కాసేపు మౌనం పాటించారు. అంతేకాకుండా శ్రీలంక క్రికెటర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి మ్యాచ్ ఆడారు. ఇక స్టేడియంలోని ఫ్యాన్స్ సైతం.. దునిత్ వెల్లలాగేను ప్రశంసిస్తున్నారు. "దేశం నీ వెంట ఉంది వెల్లలాగే.." అనే ప్లకార్డులు స్టేడియంలో ప్రదర్శించారు. కాగా తండ్రి అంత్యక్రియలు పూర్తయ్యాక దునిత్ వెల్లలాగే.. తన నివాసం నుంచి బయలుదేరిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa