కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమలకు వేలాదిమంది భక్తులు నిత్యం తరలివస్తుంటారు. శ్రీనివాసుడి దర్శనం కోసం వేయి కన్నులతో ఎదురుచూస్తూ ఉంటారు. అందుకే దేశ విదేశాల్లోనూ తిరుమలకు ప్రత్యేక స్థానం ఉంది. కోట్లాది మంది హిందువుల మదిలో శ్రీవారు అంటే ప్రత్యేకమైన భక్తి భావన ఉంది. అయితే ఈ మధ్యకాలంలో తిరుమలకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక దుష్ర్పచారాలు జరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక అంశం గురించి తిరుమల వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతిలోని కపిలతీర్థంలో తొక్కిసలాట జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. ఇదంతా అవాస్తమని స్పష్టం చేసింది. తిరుమలలో తొక్కిసలాట జరిగిందని.. కపిలతీర్థంలో సరైన ఏర్పాట్లు చేయలేదంటూ నెట్టింట వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ స్పష్టం చేసింది.
మహాలయ అమావాస్య సందర్భంగా కపిలతీర్థం బయట పితృ తర్పణాల కార్యక్రమం ఏటా నిర్వహిస్తారని టీటీడీ తెలిపింది. ఇది ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తుందని వెల్లడించింది. ఇక కపిలతీర్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లతో పాటుగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ వివరించింది. తిరుమలకు సంబంధం లేకపోయినా కూడా కొంతమంది కపిలతీర్థంలో తొక్కిసలాట అంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారన్న టీటీడీ.. దుష్ర్పచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మరోవైపు మహాలయ అమావాస్య కావటంతో కపిలతీర్థం ఆలయానికి భక్తులు పోటెత్తారు. పిండాలు, తర్పణాలు వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే రద్దీ ఎక్కువ కావటంతో ఆలయంలోకి వెళ్లే మొదటి ప్రవేశ ద్వారం వద్ద భక్తులు ఇబ్బందులు పడ్డారంటూ వార్తలు వచ్చాయి. ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయకపోవటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది.
టీటీడీకి క్లీనింగ్ యంత్రాలు విరాళం
మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదివారం 18 క్లీనింగ్ యంత్రాలు విరాళంగా అందాయి. కార్పొరేట్ సోషియల్ రెస్పాన్స్బిలిటీలో భాగంగా ఐడీబీఐ బ్యాంక్ వీటిని అందజేసింది. టీటీడీ ఆరోగ్య విభాగానికి ఐడీబీఐ బ్యాంక్ రూ.19 లక్షల విలువైన 18 క్లీనింగ్ మెషీన్లను ఆదివారం విరాళంగా అందజేసింది. ఐడీబీఐ బ్యాంకు సీఎండీ రాకేష్ శర్మ శ్రీవారి ఆలయం ముందు టీటీడీ అధికారులకు యంత్రాల తాళాలను అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa