ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రయాణికులకు అవి మరింత తక్కువ ధరకే.. నేటి అర్ధరాత్రి నుంచే

national |  Suryaa Desk  | Published : Sun, Sep 21, 2025, 07:07 PM

ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త అందించింది. రైళ్లలో అమ్ముతోన్న నీళ్ల సీసాల ధరలను తగ్గించింది. ప్రస్తుతం‘‘రైల్‌ నీర్‌’’ పేరుతో లీటరు, అరు లీటరు బాటిళ్లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. వీటి ధరను రూ. 1 మేర తగ్గించింది. ప్రస్తుతం లీటరు వాటర్ బాటిల్‌ ధర రూ. 15లు ఉండగా.. దానిని రూ. 14లకు, అర లీటరు రూ. 10లు ఉండగా.. రూ. 9లకు తగ్గించింది. ఈ మేరకు ఐఆర్సీటీసీతో సహా అన్ని జోనల్‌ ఆఫీసులకు రైల్వే బోర్డు సర్క్యులర్‌ జారీ చేసింది. రైల్వే బోర్డు ఎంపిక చేసిన సంస్థలు తయారుచేసిన వాటర్ బాటిళ్లకు ఇదే వర్తిస్తుంది. లీటర్‌ బాటిల్‌ వాటర్ ధర రూ 14కు.. అర లీటర్‌ రూ. 9కి తగ్గించినట్టు ఓ ప్రకటన తెలిపింది. ఈ వర్తింపు సెప్టెంబరు 22 అర్ధరాత్రి 12 గంటల నుంచే అమల్లోకి రానుంది.


‘‘ప్రయాణంలో ఆరోగ్యంతో పాటు ఆదా.. మినరల్ రిచ్ వాటర్ రైల్ నీర్ మరింత తక్కువ ధరకే లభిస్తుంది’’ అని ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. జీఎస్టీ శ్లాబులను తగ్గింపుతోనే ‘రైల్ నీర్’ ధరలను రైల్వే సవరించింది. కొత్త జీఎస్టీ రేట్లతో చౌక ధరలకే ఎయిర్ కండిషనర్లు, సబ్ కాంట్రాక్ట్ పనులు, వస్తువుల రవాణా సేవలు వంటి ఇతర ఖర్చులను కూడా రైల్వేలు సమీక్షించాయి. వినియోగదారుల చెల్లింపుల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు సరఫరాదారు బిల్లులను ప్రాసెస్ చేసే సమయంలో అవసరమైన తనిఖీలు చేయాలని రైల్వే బోర్డు ఆదేశించింది.


కాగా, జీఎస్టీ సంస్కరణలలో భాగంగా కేవలం 5, 18 శాతం శ్లాబులనే కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. సెప్టెంబరు మొదటివారంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 12, 28 శాతం శ్లాబులను పూర్తిగా తొలగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం సెప్టెంబరు 22 నుంచి అమల్లోకి రానుంది. జీఎస్టీ శ్లాబులను తొలగించడంతో వస్తువుల ధర తగ్గి, వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కొనసాగుతోన్న సమయంలో వ్యాపార పరిస్థితులను మెరుగుపరుస్తుంది.


ఆర్థికవేత్తల అంచనా ప్రకారం.. ఈ సంస్కరణలు భారతదేశ వృద్ధికి 20–30 బేసిస్ పాయింట్లను జోడించి, అమెరికా 50% అదనపు సుంకాల ప్రభావాన్ని భర్తీ చేయడానికి సహాయపడుతుంది. దీని వల్ల ఖజానాకు రూ. 48,000 కోట్ల మేర ఆదాయం తగ్గుతుందని భావిస్తున్నారు. కానీ, అందుబాటు, హేతుబద్ధమైన రేట్లు ఈ లోటును భర్తీ చేస్తుందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ అంటోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఏసీలు, ఫ్రిజ్‌లు, టీవీలతో పాటు ద్విచక్రవాహనాలు తదితర వస్తువుల ధరలు తగ్గనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa