ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా ఉత్సవాల వేళ ఆరోజు,,, దుర్గమ్మ వీఐపీ దర్శనాలు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 21, 2025, 08:17 PM

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలానే ఈ సంవత్సరం కూడా దసరా ఉత్సవాలకు దుర్గమ్మ ఆలయం ముస్తాబవుతోంది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 22 వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈక్రమంలో దుర్గ గుడి ఈవో శీనానాయక్ భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులకు కీలక అలర్ట్ జారీ చేశారు.


దుర్గమ్మ ఉత్సవాల సందర్భంగా ఎంత మంది భక్తులు వచ్చినా.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సారి నగరంలో విజయవాడ ఉత్సవ్‌కు 20 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. అందుకే ఈ సంవత్సరం ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించుకుని.. సామాన్య భ‌క్తుల‌కు పెద్దపీట వేస్తూ.. నూతన విధానాలతో ముందుకు వెళ్తున్నట్లు ఈవో వెల్లడించారు. అలానే సామాన్య భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకొని 500 రూపాయల టికెట్‌ను ర‌ద్దు చేశామ‌ని తెలిపారు. ఈ సంవత్సరం కేవలం రూ.300, 100 రూపాయలు, ఫ్రీ దర్శనం క్యూలైన్లు మాత్రమే ఉంటాయని తెలిపారు.


అలానే ర‌ద్దీ ఎక్కువ‌గా లేని సమయం అంటే ఉదయం 7-9 గంటల మధ్య, సాయంత్రం 3-5 గంటల మధ్య మాత్రమే వీఐపీ దర్శనాలను అనుమతిస్తామని తెలిపారు. వయసుపైబడిన వారు, దివ్యాంగులు దర్శనం చేసుకునేందుకు సాయంత్రం 4-5 గంట‌ల వ‌ర‌కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు. అలానే మూలా నక్షత్రం రోజున అనగా సెప్టెంబర్ 29వ తేదీన చంద్రబాబు నాయుడు దంపతులు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఆరోజు వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అలానే ఈ సంవత్సరం ఎక్స్‌ట్రాగా మరో 8 లడ్డూ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.


అలానే గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. దర్శనం క్యూలైన్, పార్కింగ్ హోల్డింగ్ ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా 40 పాయింట్ల వద్ద 25 లక్షల వాటర్ బాటిల్స్‌ని భక్తుల కోసం అందుబాటులో ఉంచనున్నామని చెప్పుకొచ్చారు. అలానే ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచడం కోసం సుమారు 1,600 మంది పారిశుద్ధ్య కార్మికులు 3 షిఫ్టుల్లో పనిచేస్తారని చెప్పుకొచ్చారు. అలానే భక్తుల సౌకర్యార్థం 405 మొబైల్‌ టాయిలెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa