ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ రూట్‌లో నాలుగులైన్లుగా,,,,,ఏపీలో కొత్త నేషనల్ హైవే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 22, 2025, 06:00 PM

ఆంధ్రప్రదేశ్‌లో మరో నేషనల్ హైవే విస్తరణ పనులు ప్రారంభంకానున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని కత్తిపూడి నుండి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు వరకు గల జాతీయ రహదారి 216 విస్తరణ పనులు త్వరలో మొదలు పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఒక డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రమాణాల ప్రకారం దీనిని తయారు చేస్తారు. రహదారులు, భవనాల శాఖలోని జాతీయ రహదారుల విభాగం గతంలో పిలిచిన టెండర్లను రద్దు చేసింది. ఇప్పుడు కొత్తగా కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయడానికి టెండర్లు పిలవనున్నారు.


కొన్నాళ్ల క్రితం ఆర్‌అండ్‌బీ జాతీయ రహదారుల విభాగం హైవే విస్తరణ కోసం డీపీఆర్ సిద్ధం చేయాలనుకుంది. దీని కోసం టెండర్లు పిలిచింది. ఓ సంస్థను ఎంపిక చేశారు. కానీ, ఆ టెండర్లను రద్దు చేయాలని MoRTH ఆదేశించింది. డీపీఆర్‌లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రమాణాల ప్రకారం లేకపోడంతోనే రద్దు చేశారు.. అందుకే కొత్తగా RFP టెండర్లు పిలవాలని ఆదేశించారు. 380.38 కిలోమీటర్ల పొడవైన హైవేను విస్తరించనున్నారు. ప్రస్తుతం కత్తిపూడి-కాకినాడ మధ్య 27.5 కి.మీ. మేరకే నాలుగు వరుసల రోడ్డు ఉంది. మిగిలిన రోడ్డును కూడా నాలుగు వరుసలుగా మార్చనున్నారు. భవిష్యత్తులో ట్రాఫిక్ పెరిగినా ఇబ్బంది లేకుండా, ప్రమాదాలు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ పనులు చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు వరుసల రోడ్డును ఆరు వరుసలుగా మారుస్తారు. రెండు వరుసల రోడ్డును నాలుగు వరుసలుగా పెంచుతారు. ఈ హైవేలో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు.


ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో తయారు చేసే డీపీఆర్‌లో ప్రమాణాలు చాలా కఠినంగా ఉంటాయి. 'టీమ్ లీడర్ (హైవే నిపుణుడు), రోడ్డు భద్రతా ఇంజనీర్, బ్రిడ్జి ఇంజనీర్, హైవే అండ్ పేవ్‌మెంట్ ఇంజనీర్, సీనియర్ క్వాలిటీ ఇంజనీర్, కాంట్రాక్ట్ స్పెషలిస్ట్‌లు' ఉండాలి. వీరందరికి డీపీఆర్ తయారీ సమయం మొత్తంలో జీతాలు ఇవ్వాలి. అప్పుడు అన్న అంశాలపై సమగ్రంగా ఉండే డీపీఆర్ తయారు చేయొచ్చంటున్నారు.


ఈ హైవేకు సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేయడానికి దాదాపు 12 నుంచి 18 నెలలు సమయం పడుతుంది. ఈ డీపీఆర్‌ను MoRTH ఆమోదానికి పంపిస్తారు. అక్కడ ఆమోదం లభిస్తే విస్తరణ పనులకు నిధులు కేటాయిస్తారు. కత్తిపూడి-ఒంగోలు 216 నేషనల్ హైవే కీలకంగా మారింది. ఈ హైవే తూర్పు గోదావరి, కాకినాడ, విశాఖపట్నం, ఒంగోలు వంటి నగరాలను కలుపుతోంది. ప్రయాణ సమయం, కార్గో సేవలు, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం పోర్టులకు కనెక్టివిటీ పెరుగుతుంది అంటున్నారు. చెన్నైకు వెళ్లేవారు కూడా త్వరగా వెళ్లొచ్చు. డీపీఆర్ రెడీ కాగానే ఈ ప్రాజెక్ట్ మరింత వేగవంతం చేసి పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa