కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న జీఎస్టీ 2.O సంస్కరణలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ తీరు "వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ఉంది" అని ఘాటుగా విమర్శించారు. ఇన్నాళ్లు పన్నుల భారంతో సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి, ఇప్పుడు సంస్కరణల పేరుతో కంటితుడుపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, గత 8 ఏళ్లలో మోదీ ప్రభుత్వం 'గబ్బర్ సింగ్ ట్యాక్స్' రూపంలో ప్రజల నుంచి ఏకంగా రూ.55.44 లక్షల కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. ఇప్పుడు 2.O సంస్కరణల ముసుగులో కేవలం రూ.2.5 లక్షల కోట్ల మేరకే ఉపశమనం కల్పిస్తోందని అన్నారు. "జీఎస్టీతో దోచింది కొండంత అయితే, ఇప్పుడు ఇస్తున్న తగ్గింపు గోరంత మాత్రమే" అని ఆమె విమర్శించారు.జీఎస్టీ పేరుతో ప్రజలకు లోతైన గాయం చేసి, ఇప్పుడు దానికి ఆయింట్మెంట్ రాయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని షర్మిల వ్యాఖ్యానించారు. బీజేపీవి 'బ్యాండ్-ఎయిడ్ రాజకీయాలు' అని, వీటిని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఆమె స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఇప్పుడు నవశకం, ఆత్మనిర్భరత వంటి మాటలు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని అన్నారు.జీఎస్టీ విషయంలో మోదీవి జిత్తులమారి వేషాలని దుయ్యబట్టిన షర్మిల, ఈ తాజా సంస్కరణలు కేవలం బీజేపీ చేసిన ఆర్థిక గాయాలను కప్పిపుచ్చుకునేందుకేనని విమర్శించారు. సామాన్యులను గుల్ల చేసి, ఇప్పుడు ఉపశమనం కల్పిస్తున్నట్లు మాట్లాడటం మోసపూరితమని ఆమె పేర్కొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa