ఆసియాకప్ సూపర్ 4లో భారత్తో మ్యాచ్కు ముందు బంగ్లాదేశ్ హెడ్కోచ్ ఫిల్ సిమ్మన్స్ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఆసియాకప్ 2025 లీగ్ స్టేజ్ మ్యాచ్లో బంగ్లాదేశ్.. హాంకాంగ్, అప్ఘానిస్థాన్ లాంటి చిన్న జట్లను ఓడించి సూపర్-4కు చేరింది. అయితే సూపర్-4లో శ్రీలంకకు షాక్ ఇచ్చింది. ఇక తన తర్వాతి మ్యాచ్లో బుధవారం ఆ జట్టు భారత్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న బంగ్లాదేశ్ హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
క్రికెట్లో ప్రతి జట్టుకి టీమిండియాను ఓడించే సామర్థ్యం ఉందని వ్యాఖ్యానించాడు. ఆ రోజు ఆట ఎలా ఆడతామన్నదే ముఖ్యమని, రికార్డులు కాదని బీరాలు పలికాడు. “భారత్ నంబర్ వన్ టీ20 టీమ్ కావచ్చు. కానీ ప్రతి జట్టుకు భారత్ను ఓడించే సామర్థ్యం ఉంది. మేం మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి.. వచ్చే మ్యాచ్లో ఆధిపత్యం ప్రదర్శిస్తాం. మేం శ్రీలంకను మాత్రమే ఓడించేందుకు మాత్రమే ఇక్కడకు రాలేదు. ఆసియాకప్ టైటిల్ కోసం వచ్చాం,” అని సిమ్మన్స్ వ్యాఖ్యానించాడు.
ఇక బంగ్లాదేశ్ జట్టు.. బుధవారం భారత్తో, ఆ తర్వాతి రోజు అంటే గురువారం పాకిస్థాన్తో తలపడనుంది. దీనిపై కూడా సిమ్మన్స్ మాట్లాడాడు. వరుస రోజుల్లో మ్యాచ్లు ఆడటం ఏ జట్టుకైనా ఇబ్బందే అని.. ఇది అన్యాయమని చెప్పుకొచ్చాడు. భారత్తో మ్యాచ్కు ముందు బంగ్లాదేశ్ కోచ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కొందరేమే.. అతడి కామెంట్స్ వారి ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తున్నాయని చెబుతున్నారు. మరికొందరేమో.. అతి విశ్వాసం ఉండకూడదని చురకలు అందిస్తున్నారు.
ఇక ఆసియాకప్ సూపర్-4లో జరిగిన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ సంచలన బ్యాటింగ్తో మరో బంతి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ప్రస్తుతం ఆసియాకప్ సూపర్-4 పాయింట్స్ టేబుల్లో బంగ్లాదేశ్ రెండో ప్లేసులో ఉంది. సూపర్-4 మ్యాచ్లు ముగిసే సరికి టాప్-2లో ఉన్న జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా ఈ పోరు జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa