ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రంతో వివాదంలో సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్‌కు ఎదురుదెబ్బ

national |  Suryaa Desk  | Published : Wed, Sep 24, 2025, 08:04 PM

సోషల్ మీడియా కంటెంట్‌ను నియంత్రించే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో జరుగుతున్న న్యాయపోరాటంలో ఎలాన్ మస్క్‌కు చెందిన 'ఎక్స్ కార్ప్'  సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వ అధికారాలను సవాలు చేస్తూ ఎక్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు బుధవారం కొట్టివేసింది. సోషల్ మీడియాపై నియంత్రణ కచ్చితంగా అవసరమని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'సహ్యోగ్ పోర్టల్' ద్వారా అడ్డూఅదుపూ లేని సెన్సార్‌షిప్ జరుగుతోందన్న ఎక్స్ వాదనలను జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. "భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో నియంత్రణ లేని రాతలు, ప్రసంగాలు అరాచకానికి దారితీస్తాయి" అని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో కంటెంట్‌ను నియంత్రించడం అత్యవసరమని, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన నేరాల విషయంలో ఇది మరింత తప్పనిసరి అని పేర్కొంది. లేకపోతే, రాజ్యాంగం కల్పించిన గౌరవంగా జీవించే హక్కుకు భంగం వాటిల్లుతుందని తెలిపింది.కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ, సెక్షన్ 79(3)(బి)లను దుర్వినియోగం చేస్తోందని ఎక్స్ కార్ప్ తన పిటిషన్‌లో ఆరోపించింది. చట్టబద్ధమైన ప్రక్రియలను పక్కనపెట్టి, 'సహ్యోగ్ పోర్టల్' ద్వారా ఒక సెన్సార్‌షిప్ వ్యవస్థను సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని వాదించింది. ప్రతిపక్ష నేతలు, విమర్శకుల కంటెంట్‌ను తొలగించాలని కూడా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని పేర్కొంది.అయితే, ఈ వాదనలను కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఖండించారు. దేశ సార్వభౌమత్వం, భద్రత, ప్రజా శాంతి వంటి అంశాలకు విఘాతం కలిగించే సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిరోధించే అధికారం ఐటీ చట్టం ప్రభుత్వానికి కల్పించిందని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వ అధికారాలను సమర్థిస్తూ ఎక్స్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ తీర్పుతో ఆన్‌లైన్ కంటెంట్‌ను నియంత్రించే విషయంలో కేంద్ర ప్రభుత్వ అధికారాలు మరింత బలపడినట్లయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa