మచిలీపట్నం పీవీఆర్ మాల్లోని థియేటర్ సిబ్బంది తీరు పట్ల పలువురు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆనందంగా కుటుంబంతో సినిమా చూసేందుకు వచ్చిన వారు, సిబ్బంది వింత నిబంధనలతో ఆవేదనతో ఇంటిముఖం పడుతున్నారు. టిక్కెట్ల ధరలు పెంచడం ఒక దోపిడీ అయితే, మైనర్ల పేరుతో మరో దోపిడీ జరుగుతోందని ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు.ఏ సర్టిఫికేట్ సినిమాకు మైనర్లకు అనుమతి లేదని థియేటర్ వద్ద ప్రకటనలు కనిపిస్తున్నాయి. కానీ ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న పిల్లలను మాత్రం సిబ్బంది థియేటర్లోకి అనుమతిస్తున్నారు. కానీ నేరుగా థియేటర్ వద్ద టిక్కెట్లు కొనడానికి వచ్చిన వారికి మాత్రం మైనర్లకు అనుమతి లేదని తలుపులు మూసేస్తున్నారు. ఈ నిర్ణయం పలువురు ప్రేక్షకులను గందరగోళానికి గురి చేస్తోంది. ఓ సందర్భంలో 15 ఏళ్ల పిల్లలను థియేటర్లోకి అనుమతించకుండా, తల్లిదండ్రులు మాత్రమే లోపలికి వెళ్లాలని సిబ్బంది వాదించారు. కానీ మైనర్లకు ఆన్లైన్లో టిక్కెట్లు కొన్నప్పుడు మాత్రమే అనుమతిస్తామని సిబ్బంది చెప్పడం ప్రేక్షకులకు అర్థం కాని విషయంగా మారింది. ఈ విచిత్రమైన రూల్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలియడం లేదని వారు అంటున్నారు. ఈ సమస్య ఇంతటితో ఆగలేదు. టిక్కెట్లు కొనుగోలు చేసిన వారు, పిల్లలను అనుమతించకపోతే డబ్బులు తిరిగి ఇవ్వమని కోరినా, సిబ్బంది అది కుదరదని తేల్చిచెప్పారు. డబ్బులు తిరిగి ఇవ్వమని, పిల్లలను లోపలికి పంపమని, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవాలని కొందరు సిబ్బంది బెదిరింపు ధోరణిలో మాట్లాడారని ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు.ఇలాంటి ప్రవర్తన ఆయా కుటుంబాలను ఆవేదనకు గురిచేసింది. సినిమా చూసే ఆనందం కోసం వచ్చిన వారు, నిరాశతో, అవమానంతో ఇంటిముఖం పట్టవలసి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa