పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన సందర్భంగా ఆయన సోదరుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ విజయం వెనుక ఓ బలమైన సెంటిమెంట్ ఉందని చెబుతూ ఆయన చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన మనవడు అడుగుపెట్టిన తర్వాతే మెగా కుటుంబానికి పట్టిన దురదృష్టం తొలగిపోయి, మంచి రోజులు ప్రారంభమయ్యాయని నాగబాబు భావోద్వేగంగా పేర్కొన్నారు."ప్రతి కుటుంబంలోనూ అదృష్టం, కృషి కలిసొచ్చే ఓ సమయం వస్తుంది. మా మనవడి రాకతో మా కుటుంబానికి పట్టిన పీడ విరగడైంది. సినిమాల పరంగా తమ్ముడు పవన్ కల్యాణ్ ఎంతో కష్టపడ్డాడు, కానీ కొన్నిసార్లు దైవ సంకల్పం కూడా తోడవ్వాలి. ఆ చిన్నారి రాకతో పరిస్థితి మారిపోయింది" అని నాగబాబు తన పోస్టులో రాసుకొచ్చారు. 'ఓజీ' సినిమా ఒక ప్రభంజనంలా వచ్చిందని, ఇది మెగా కుటుంబానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. అన్నయ్య చిరంజీవితో పాటు రామ్ చరణ్, సాయి తేజ్, వైష్ణవ్, వరుణ్ వంటి తారలంతా ఉన్న తమ కుటుంబం ఈ విజయంతో మరింత ముందుకు దూసుకెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని నాగబాబు ప్రత్యేకంగా అభినందించారు. 'ఓజీ' ఒక భూకంపం సృష్టించిన బ్లాక్బస్టర్ అని అభివర్ణించారు. పవన్ కల్యాణ్ అభిమానులందరి కలను నిజం చేసిన దర్శకుడు సుజీత్ను 'అసలైన ఫ్యాన్బాయ్' అంటూ కొనియాడారు. ప్రతి ఫ్రేమ్లో పవన్ కల్యాణ్ను అద్భుతంగా చూపించారని ప్రశంసించారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన నేపథ్య సంగీతం రోమాలు నిక్కబొడుచుకునేలా చేసిందని, సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని కితాబిచ్చారు. సినిమాటోగ్రాఫర్లు రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంసల పనితనాన్ని, నిర్మాత డీవీవీ దానయ్య ధైర్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ అద్భుతమైన విజయంలో పాలుపంచుకున్న నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa