ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500.. మంత్రి కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 07:40 PM

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలకు వరాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు , మెగా డీఎస్సీ, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు , స్త్రీ శక్తి పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. అయితే సూపర్ సిక్స్ పథకాలు అన్నింటిలో కీలకమైన ఆడబిడ్డ నిధి పథకం గురించి ఏపీలోని మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి పథకం కింద 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున్ అకౌంట్లలో జమ చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని మహిళలు అమలు చేస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే ఏపీలో ఆడబిడ్డ నిధి పథకం అమలుపై కీలక అప్ డేట్ వచ్చింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసనమండలి వేదికగా ఆడబిడ్డ నిధి పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం పరిశీలన జరుగుతోందని మంత్రి వివరించారు. అంచనాలు వేస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం లోటు బడ్జెట్ ఇచ్చినప్పటికీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం, పింఛన్ల పెంపు, స్త్రీ శక్తి వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఆడబిడ్డ నిధి పథకం విధివిధానాలను ఖరారు చేయాల్సి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.


2014 -19 సమయంలో సుమారు 89 లక్షల మంది మహిళలకు పసుపు కుంకుమ కింద రూ.10000 , క్యాపిటల్ ఇన్‌ఫ్యూజ్‌మెంట్ కింద రూ.10 వేలు చొప్పున అర్హత కలిగిన వారందరికీ రూ.20 వేల చొప్పున అందించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయూత పేరుతో ఏటా రూ.75 వేలు ఇస్తామన్నారని.. కానీ 25 లక్షల మందికే పరిమితం చేశారని మంత్రి విమర్శించారు. 89 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటే.. కేవలం 25 లక్షల మందికే ఇచ్చారని ఆరోపించారు. మరోవైపు ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. మండలిలోనూ ఈ విషయమై వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa