ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీసా సమస్యలు ఇలాగే ఉంటే కటీఫ్ తప్పదు.. ట్రంప్‌కి భారీ షాకిచ్చిన కీలక మిత్రదేశం

international |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 09:20 PM

అమెరికా, దక్షిణ కొరియాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో వీసా సమస్యలు పెద్ద అడ్డంకిగా మారాయి. ఈ సమస్య పరిష్కారం కాకపోతే అమెరికాలో పెట్టుబడులు పెట్టడం కష్టమని దక్షిణ కొరియా ప్రధాని కిమ్ మిన్-సియోక్ స్పష్టం చేశారు. ఇటీవల జార్జియాలో హ్యుందయ్, ఎల్జీ కంపెనీపై దాడులు చేసిన ఫెడరల్ అధికారులు.. చట్టవిరుద్ధంగా అమెరికాలోకి వచ్చారని ఆరోపిస్తూ వందలాది మంది దక్షిణ కొరియాకు చెందిన కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. ఇది దక్షిణ కొరియా ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఈ ఘటన తర్వాత తమ భద్రతపై హామీ ఇవ్వకపోతే మళ్లీ అమెరికాకు వెళ్లడానికి కార్మికులు, వారి కుటుంబాలు భయపడుతున్నాయని దక్షిణ కొరియా ప్రధాని అన్నారు.


ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా, దక్షిణ కొరియా- అమెరికాలో 350 బిలియన్ డాలర్లు భారీ పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. కానీ, ఈ ఒప్పందంపై చర్చలు ఇప్పుడు నిలిచిపోయాయి. దీనికి కారణం వీసా సమస్యలే. దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ మొత్తాన్ని రుణాల రూపంలో ఇవ్వాలని భావిస్తుండగా, అమెరికా మాత్రం ప్రత్యక్ష పెట్టుబడులు కోరుతోంది. ఒకవేళ అమెరికా డిమాండ్లకు తలొగ్గితే అది దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం చూపుతుందని, ఈ ఒప్పందానికి పార్లమెంటరీ ఆమోదం అవసరమని కిమ్ అన్నారు.


అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిన 350 బిలియన్ డాలర్లు మొత్తం, దక్షిణ కొరియా విదేశీ మారక నిల్వల్లో 70% కంటే ఎక్కువ. ఒకవేళ ఈ డిమాండ్లను నెరవేర్చాలంటే, అమెరికాతో ఒక కరెన్సీ స్వాప్ ఒప్పందం అవసరమని కొరియా ప్రధాని తెలిపారు. లేకపోతే 1997లో ఎదురైన ఆర్థిక సంక్షోభం మళ్లీ వచ్చే ప్రమాదం ఉందని కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ హెచ్చరించారు. ఈ ఆర్థిక భారాన్ని మోయడం దేశానికి కష్టమని, అందుకే అమెరికా డిమాండ్లకు అంగీకరించడం లేదని కిమ్ పేర్కొన్నారు.


జపాన్‌తో అమెరికా చేసుకున్న 550 బిలియన్ల డాలర్లు పెట్టుబడి ఒప్పందాన్ని ఈ సందర్భంగా సౌత్ కొరియా ప్రధాని ప్రస్తావించారు. ఆ ఒప్పందం ప్రకారం... జపాన్ పెట్టుబడులు పెట్టడంలో విఫలమైతే, టారిఫ్‌లు పెంచే అవకాశం ట్రంప్‌కు ఉంది. ఇలాంటి ఒప్పందాలు తమకు ఇష్టం లేదని, దీనిపై ప్రజలు కూడా అసంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ చర్చలు వచ్చే సంవత్సరం వరకు సాగకుండా, త్వరగా ఒక పరిష్కారం కనుగొనాలని ఆయన ఆకాంక్షించారు. దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థ, భద్రత గురించి కూడా కిమ్ మాట్లాడారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి పెట్టుబడులు అవసరమని, అందుకే ఆర్థిక విస్తరణ విధానాలపై దృష్టిసారించామని చెప్పారు. అలాగే, దేశ రక్షణ వ్యయాన్ని జీడీపీలో 3.5%కి పెంచాలని ఆలోచిస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa