కొన్నిసార్లు అనాలోచితంగా, దూకుడుగా తీసుకునే నిర్ణయాలు తిరిగి మనకే కష్టం తెస్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాపై లక్ష డాలర్ల ఫీజును పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయనకు అదే పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా, అమెరికాలో అతిపెద్ద వ్యాపార సంస్థల సమూహమైన యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో కేసు వేయాలని యోచిస్తోంది. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ,.. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలతో సహా దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన వ్యాపార సంస్థల లాబీ. సాధారణంగా ట్రంప్తో నేరుగా విభేదించడానికి ఇష్టపడని ఈ సంస్థ, ఇప్పుడు ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఒకవేళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గనుక కేసు వేస్తే.. ట్రంప్తో వీరు కోర్టులో పోరాడటం ఇది రెండోసారి అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్ప్పుడు 2020లో నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను నిలిపివేసినప్పుడు కూడా యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ కేసు వేసి గెలిచింది. అప్పుడు ఫెడరల్ కోర్టు ట్రంప్ ఆదేశాలను రద్దు చేసింది. H-1B వీసా ఫీజును ట్రంప్ పెంచడానికి కారణం ఈ వీసాను తక్కువ జీతాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించడం.
దీనివల్ల అమెరికా ఉద్యోగులకు నష్టం జరుగుతోందని ఆయన అన్నారు. అయితే, ఈ నిర్ణయం వల్ల టెక్ పరిశ్రమ సంతోషిస్తుందని ట్రంప్ చెప్పారు. కానీ, ఆ రంగానికి చెందిన దిగ్గజ కంపెనీలు మాత్రం ట్రంప్ నిర్ణయంపై ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో, యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఒక న్యాయపోరాటానికి సిద్ధమవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు, యాపిల్, అమెజాన్, జేపీమోర్గాన్ వంటి ప్రధాన కంపెనీలకు లేఖలు రాసిన అమెరికా చట్టసభ్యులు .. H-1B వీసాలపై వేలాది విదేశీ ఉద్యోగులు నియమించుకోవడంపై వివరణ కోరారు. అదే సమయంలో, అమెరికన్ల ఇతర ఉద్యోగ అవకాశాలను తగ్గించడం పట్ల వారు ప్రశ్నలు లేవనెత్తారు. రిపబ్లికన్ సెనేటర్ చక్ గ్రాస్లీ, డెమొక్రటిక్ సెనేటర్ డిక్ డర్బిన్ నేతృత్వంలో ఈ లేఖలు పంపి.. కంపెనీలు ఎంతమంది H-1B ఉద్యోగులను నియమించుకున్నాయి, వారికి ఇచ్చే జీతభత్యాలు ఎంత, స్థానిక కార్మికులను ఉద్యోగాల నుంచి తప్పించారా లేదా అనే వివరాలను ఇవ్వాలని కోరారు.
ఇదిలా ఉండగా, హెచ్ 1బీ వీసా ఫీజు పెంపుతో అమెరికాకే భారీ నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ తీరుపై స్వదేశంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కానీ, ట్రంప్ మాత్రం తన వైఖరి మార్చుకోనుగాక మార్చుకోను అంటున్నారు. ఇదే సమయంలో వీసా విధానాన్ని మరింత కఠినతరం చేస్తూ.. లాటరీ విధానానికి కూడా స్వస్తి పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa