ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలోని భారత సంతతి వైద్యుడికి 14 ఏళ్ల జైలుశిక్ష

international |  Suryaa Desk  | Published : Sat, Sep 27, 2025, 09:01 PM

అమెరికాలో ఓ భారత సంతతి వైద్యుడు ఆరోగ్య సంరక్షణ పథకాల్లో మోసం, అక్రమంగా ఓపియోయిడ్ మందుల పంపిణీ, మనీ లాండరింగ్ వంటి తీవ్ర నేరాలకు పాల్పడినందుకు గాను ఏకంగా 14 సంవత్సరాల జైలు శిక్ష వేసింది అక్కడి న్యాయస్థానం. పెన్సిల్వేనియాకు చెందిన 48 ఏళ్ల డాక్టర్ నీల్ కే ఆనంద్.. తన చర్యలకు జాలి, దయ వంటి మానవతా విలువలే ప్రేరణ అని వాదించినప్పటికీ కోర్టు మాత్రం వాటిని పూర్తిగా తిరస్కరించింది. ఈ దారుణాలకు అతనిలో ఉన్న అత్యాశే ప్రధాన కారణమని స్పష్టం చేసింది. తన కేసు విచారణ మొదలైన తర్వాత కూడా అతను తన నేరాల ద్వారా సంపాదించిన 1.2 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం రూ.10 కోట్లు) సొమ్మును ఒక బంధువు ఖాతాలోకి బదిలీ చేసి దాచడానికి ప్రయత్నించడం అతడి మోసపూరిత వైఖరికి నిదర్శనమని కోర్టు పేర్కొంది.


డాక్టర్ ఆనంద్ కేవలం తొమ్మిది మంది రోగులకు 20,000 ఆక్సికోడోన్ టాబ్లెట్లను అక్రమంగా సిఫారసు చేసి.. వాటిని పంపిణీ చేసినట్లు కోర్టు రికార్డులు వెల్లడించాయి. ఈ తీవ్రమైన నేరాలకు గాను బెంసలేమ్‌కు చెందిన ఆనంద్‌కు 168 నెలల జైలు శిక్షతో పాటు 2 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం రూ.17.6 కోట్లు) పరిహారం చెల్లించాలని, అలాగే నేరాల ద్వారా సంపాదించిన 2 మిలియన్ డాలర్ల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఆదేశాలు జారీ చేసింది. ఆ పరిహారం డబ్బును బాధితులకు అందించాలని కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో ఆనంద్ ప్రభుత్వ ఆరోగ్య పథకాలైన మెడికేర్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలైన బ్లూ క్రాస్, ఆంథెమ్‌లను కూడా మోసగించారు.


గతేడాది ఏప్రిల్‌లోనే ఆనంద్ పలు ఫెడరల్ అభియోగాలపై దోషిగా తేలారు. వాటిలో ప్రధానమైనవి ఆరోగ్య సంరక్షణ పథకాల్లో మోసం, నిషేధిత పదార్థాల అక్రణ పంపిణీ, మనీ లాండరింగ్. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. రోగులకు వైద్యపరంగా అవసరం లేని మందులను "గుడీ బ్యాగ్స్" పేరుతో అందించడం ద్వారా ఆనంద్ ఇన్సూరెన్స్ సంస్థలను మోసగించారు. ఈ "గుడీ బ్యాగ్స్"ను ఆనంద్‌కు చెందిన ఫార్మసీలే రోగులకు అందించేవి. ఈ అవాంఛిత "గుడీ బ్యాగ్స్"ను రోగులు తీసుకునేలా ప్రోత్సహించడానికి.. ఆనంద్ ఆక్సికోడోన్ వంటి శక్తివంతమైన, వ్యసనపూరితమైన మందులను అక్రమంగా పంపిణీ చేసినట్లు కూడా ప్రాసిక్యూషన్ వెల్లడించింది.


ఈ కుట్రలో భాగంగానే ఆనంద్ ముందుగా సంతకం చేసి ఇచ్చిన ఖాళీ ప్రిస్క్రిప్షన్‌లను ఉపయోగించి లైసెన్స్ లేని వైద్య ఇంటర్నులు రోగులకు ఆక్సికోడోన్‌ను అందించేవారు. ఈ దారుణాలకు కారణం రోగుల పట్ల దయ కాదుని.. కేవలం స్వార్థమే అని జిల్లా జడ్జి చాడ్ ఎఫ్. కెన్నీ స్పష్టం చేశారు. "వారి బాధ మీకు లాభం అయ్యింది. ఈ కాలంలో మీరు రోగులకు వైద్యం అందించడంపై దృష్టి పెట్టలేదు" అని జడ్జి అన్నారు. కోర్టులో తనతో పాటు బంధువుల తరపున వాదిస్తూ.. తన చర్యలు రోగుల పట్ల కరుణతో కూడుకున్నవని ఆనంద్ చెప్పుకొచ్చారు. 2001లో న్యూయార్క్ నగరంలో 9/11 దాడి బాధితులకు వైద్య సేవలు అందించానని.. ఆ తర్వాత అమెరికా నౌకాదళంలో వైద్యుడిగా పని చేశానని పేర్కొన్నారు. తన జీవితం ఇతరుల సంరక్షణకే అంకితమైందని నిరూపించడానికి ప్రయత్నించారు. అయితే అతని వాదనలను కోర్టు పూర్తిగా తిరస్కరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa