ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలస్తీనాను దేశంగా గుర్తించేందుకు ప్రతిపాదన,,,,ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ షాక్

international |  Suryaa Desk  | Published : Sun, Sep 28, 2025, 08:19 PM

గాజా యుద్ధాన్ని ముగించి, భవిష్యత్ పాలస్తీనా దేశం ఏర్పాటుకు మార్గం సుగమం చేసేలా అమెరికా 21 పాయింట్ల ప్రతిపాదన తీసుకొచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బందీలను వెంటనే విడుదల చేయడం, పాలస్తీనియన్లు గాజా స్ట్రిప్‌లో ఉండేలా ప్రోత్సహించడం, ఆయుధాలు వీడిన హమాస్ సభ్యులకు క్షమాభిక్ష ప్రసాదించడం వంటి ప్రతిపాదనలు ఈ ప్రణాళికలో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశం సందర్భంగా కొన్ని అరబ్, ముస్లిం దేశాలతో పంచుకుంది.


గాజా స్ట్రిప్‌లో పాలస్తీనియన్లు ఉండేలా ప్రోత్సహించడమనే ప్రణాళిక అమెరికా విధానంలో ఒక పెద్ద మార్పును సూచిస్తుంది ఎందుకంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరిలో అమెరికా గాజాను స్వాధీనం చేసుకుంటుందని, అక్కడ రెండు మిలియన్ల గాజా ప్రజలను శాశ్వతంగా తరలించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా, పాలస్తీనాను దేశంగా గుర్తించే విషయంలో ట్రంప్ వైఖరి మారడం విశేషం. ఆయన ఎప్పుడూ రెండు దేశాల పరిష్కారానికి ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదు. అయితే, హమాస్ ఆయుధాలు వీడటం, గాజా పరిధి కుదింపు, జనాభాను వేర్పాటువాద భావజాలం నుంచి బయటపడేసేలా ఓ ప్రక్రియను ఏర్పాటు చేయడం వంటివి ఈ ప్రతిపాదనల్లో ఇజ్రాయెల్‌కు మేలు జరిగే అంశాలు కూడా ఉన్నాయి.


ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు మాత్రం రెండు దేశాల పరిష్కారాన్ని తాను ఎన్నటికీ అంగీకరించబోనని, ఈ ప్రతిపాదనకు తాము పూర్తిగా వ్యతిరేకమని శుక్రవారం ఐరాస సాధారణ సభ సమావేశంలో పునరుద్ఘాటించారు. ‘అక్టోబర్ 7 ఘటన ( హమాస్ దాడి) తర్వాత పాలస్తీనియన్లకు జెరూసలేం నుంచి ఒక మైలు దూరంలో ఉన్న దేశాన్ని ఇవ్వడం అంటే సెప్టెంబర్ 11 తర్వాత న్యూయార్క్ నగరం నుంచి ఒక మైలు దూరంలో ఉన్న అల్-ఖైదా దేశాన్ని ఇచ్చినట్లే. ఇది పూర్తిగా పిచ్చితనం. ఇది వెర్రితనం, మేము అలా చేయం... మా గొంతులోకి ఉగ్రవాద దేశాన్ని తోసేయడానికి ఇజ్రాయెల్ అనుమతించదు.’


అయిప్పటికీ, ఆశావాహంగా ఉన్న ఒక ఒప్పందం కుదిరే అవకాశముందని అన్నారు. ట్రూత్ సోషల్‌లో ‘గత నాలుగు రోజులుగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. విజయవంతంగా పూర్తయ్యే ఒప్పందం కుదిరే వరకు ఇవి కొనసాగుతాయి’ అని తెలిపారు. ‘ఆ ప్రాంతంలోని అన్ని దేశాలు ఈ చర్చల్లో పాల్గొంటున్నాయి. హమాస్‌కు కూడా ఈ చర్చల గురించి సమాచారం ఉంది.. అలాగే ఇజ్రాయెల్ కూడా ముఖ్యంగా ప్రధాని నెతన్యాహూ సహా అన్నిస్థాయిల్లో సమాచారం అందింది’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, గాజా స్వాధీనం చేసుకోవాలని భావిస్తోన్న ఇజ్రాయెల్ ప్రధానికి ఇది ఓ రకంగా ఎదురుదెబ్బే.


అరబ్ నేతలతో ట్రంప్ సమావేశం అనంతరం అమెరికా పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ మాట్లాడుతూ...‘మేము ఒక అత్యంత ఫలప్రదమైన సమావేశం జరిపాం.. మేము దీనిని ‘ట్రంప్ 21-పాయింట్ల పశ్చిమాసియా శాంతి ప్రణాళిక’గా పిలుస్తున్నాం.. ముఖ్యంగా గాజాలో శాంతి కోసం’ అని అన్నారు. ‘కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాదు, ఈ ప్రాంతంలోని పొరుగుదేశాల ఆందోళనలను కూడా ఇది పరిష్కరిస్తుందని నేను భావిస్తున్నాను.. మేము ఆశతో ఇంకా చెప్పాలంటే విశ్వాసంతో ఉన్నాం.. రాబోయే రోజుల్లో ఏదో ఒక విధమైన పురోగతిని ప్రకటించగలుగుతామని అనుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa