పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్లు వైట్హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిసినట్లుగా ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో అసిమ్ మునీర్.. పాకిస్థాన్లో లభించే అరుదైన ఖనిజాలను ట్రంప్కు చూపిస్తూ వాటి గురించి చెబుతున్నట్లు ఉంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు పాకిస్థాన్ దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ భేటీ గురించి వైట్హౌస్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనగానీ, ఫొటోగానీ విడుదల చేయకపోవడం గమనార్హం.
ఆర్థిక ప్రయోజనాలతో కూడిన వ్యూహాత్మక దౌత్యానికి పాకిస్థాన్ ఈ భేటీతో ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇస్లామాబాద్లో అమెరికా సంస్థ 'యునైటెడ్ స్టేట్స్ స్ట్రాటజిక్ మెటల్స్' తో రెండు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగిన అనంతరం ఈ భేటీ జరగడం గమనార్హం. ఈ ఒప్పందాల ప్రకారం, ఆంటిమోని, రాగి, బంగారం, టంగ్స్టన్, ఇతర అరుదైన ఖనిజాలను పాకిస్థాన్ నుంచి అమెరికాకు ఎగుమతి చేస్తారు. మొదటి దశలో దాదాపు $500 మిలియన్ల మేర అమెరికా పెట్టుబడులు రానున్నాయని పాక్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఒప్పందాలు పాకిస్థాన్ ఖనిజ వనరుల పట్ల అమెరికాకు ఉన్న ఆసక్తిని తెలియజేస్తున్నాయి. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా వంటి ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాలు ఉన్నప్పటికీ.. వాటిని వాణిజ్య స్థాయిలో వెలికితీయడానికి చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నట్లు నిపుణుల చెబుతున్నారు. అయితే ఈ ఒప్పందాలు కేవలం తొలి దశ పెట్టుబడులను ఆకర్షించడానికి మాత్రమే మార్గం సుగమం చేస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరోవైపు ఈ ఖనిజ దౌత్యం ద్వారా పాకిస్థాన్ అమెరికాతో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అమెరికాతో పాకిస్థాన్ సంబంధాలను మెరుగు పరచడమే కాకుండా చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ ద్వారా చైనా చేస్తున్న భారీ పెట్టుబడులను బ్యాలెన్స్ చేయడంలో కూడా సహాయ పడుతుందని భావిస్తున్నారు.
కాగా.. అమెరికా ఉక్రెయిన్తో ఇదే తరహాలో ఖనిజాల తవ్వకాల ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపాలన్నా.. ఉక్రెయిన్కు సహాయ సహకారాలు కావాలన్నా ఖనిజ ఒప్పందం చేసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువచ్చి ఉక్రెయిన్తో ఈ ఒప్పందాన్ని బలవంతంగా చేయించుకుంది అమెరికా. ఈ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్లోని అరుదైన సహజ వనరులు అయిన అల్యూమినియం, గ్రాఫైట్, చమురు, సహజ వాయువు, ఇతర ఖనిజాలను తవ్వుకునేందుకు అమెరికాకు అనుమతి లభించినట్లు అయింది. ఈ డీల్ విలువ 500 బిలియన్ డాలర్లు ఉండొచ్చని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్కు అమెరికా 100 బిలియన్ డాలర్లు ఇస్తే.. తీసుకునేది మాత్రం 500 బిలియన్ డాలర్లు అని గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa