ఇరాన్ అణు కార్యక్రమంపై ఆంక్షలను ఐక్యరాజ్య సమితి తిరిగి విధించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. దీంతో ఇప్పటికే ఆహారం, నిధుల కొరతతో అల్లాడుతున్న ఆ దేశం మరింత కష్టాల్లోకి జారుకుంది. ఆంక్షలను ఆపేందుకు చివరి నిమిషం వరకు ఇరాన్ చేసిన దౌత్య ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఈ ఆంక్షల ప్రకారం.. ఇరాన్కు విదేశాల్లో ఉన్న ఆస్తులను స్తంభింపజేస్తారు. అలాగే ఆ దేశంతో ఆయుధ డీల్స్ నిలిపివేస్తారు. ఇరాన్కు సంబంధించిన బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమంపై కూడా చర్యలు తీసుకోనున్నారు. నిజానికి ఈ ఆంక్షలు అక్టోబర్ 18న శాశ్వతంగా తొలగిపోవాల్సి ఉంది. అయితే గతంలో జరిగిన జాయింట్ కాంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపణలు రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఇందులో సంతకం చేసిన ఏ దేశమైనా అవసరమైతే ఆంక్షలను తిరిగి విధించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలు ఆగస్టు 28న ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ప్రకటించాయి. దీంతో 30 రోజుల కౌంట్డౌన్ ప్రారంభమై.. ఇప్పుడు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
ఈ ప్రక్రియను ఐరాస భద్రతా మండలిలో ఏ దేశమూ వీటో చేయకుండా ఉండేలా డిజైన్ చేశారు. దీనివల్ల ఇరాన్కు మద్దతుగా ఉండే చైనా, రష్యా దేశాలు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. చైనా ఇరాన్ నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తోంది. రష్యా కూడా తమ యుద్ధంలో ఇరాన్ డ్రోన్లను ఉపయోగిస్తోంది.
ఇరాన్ దేశాధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆంక్షలను నిలిపివేయడానికి చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. అయితే దౌత్య ప్రయత్నాలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలు వాటిని ఆపలేకపోయాయి. దీంతో అరగ్చీ మాట్లాడుతూ.. ఈ ఆంక్షలు ఇరాన్ ప్రజల సంకల్పాన్ని ప్రభావితం చేయలేవని, కానీ దౌత్య మార్గాలను మూసివేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే అమెరికా 2018లో ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలగడంతోనే ఈ సమస్య తలెత్తిందని ఇరాన్ వాదిస్తోంది. అమెరికా వైదొలగిన తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసిందని.. దీంతో ఇజ్రాయెల్, అమెరికా గత జూన్లో ఇరాన్ అణు కేంద్రాలపై బాంబు దాడులు చేశాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుతమైనదని చెబుతున్నా.. ప్రపంచ దేశాలు మాత్రం ఆ దేశం అణు ఆయుధాలను అభివృద్ధి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఇరాన్.. ఈ నిర్ణయంతో మరిన్ని కష్టాల పాలవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa