ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టాలిన్ సర్ రివేంజ్ ఏదైనా నాపైనే.. వాళ్లను టచ్ చేశారో.. విజయ్

national |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 08:19 PM

కరూర్ తొక్కిసలాట ఘటనపై నటుడు, టీవీకే చీఫ్ విజయ్ తొలిసారి స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, ఇలాంటిది ఎప్పుడూ తన జీవితంలో ఎదుర్కొలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సిందని విజయ్ అభిప్రాయపడ్డారు. నిజం త్వరలోనే బయటపడుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు, తాను భద్రతకే ప్రాధాన్యత ఇస్తానన్న విజయ్.. తనను టార్గెట్ చేయండి కానీ, ప్రజలను కాదని అని పేర్కొన్నారు. త్వరలోనే బాధితులను కలుస్తానని తెలిపాడు. అంతేకాదు, తిరుపతికి వెళ్లి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటానని ప్రకటించారు. ‘ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాపై ప్రతీకారం తీర్చుకోడానికి ప్రయత్నిస్తున్నారా? కానీ, మేము ఎలాంటి తప్పుచేయలేదు’ అని విజయ్ పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి సర్.. మీరు ఏదైనా ప్రతీకారం కోసం ప్లాన్ చేస్తే అది నాపైనే చేయండి... మా నాయకులను టచ్ చేయకండి.. నేను ఎక్కడికి పోను ఇళ్లు లేదా ఆఫీసులో ఉంటా’ అని స్టాలిన్‌ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.


కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే జిల్లా సెక్రెటరీ మతియఝగన్‌పై పోలీసులు హత్యాయత్నం, నేరపూరిత హోమిసైడ్, ప్రజా భద్రతకు ముప్పు కలిగించడం వంటి సెక్షన్ల కిందట పోలీసులు కేసు నమోదుచేయడంతో విజయ్ పైవిధంగా స్పందించినట్టు తెలుస్తోంది. అలాగే, మరో ఇద్దరు సీనియర్ టీవీకే నేతలు జనరల్ సెక్రెటరీ ఎన్ బస్సీ ఆనంద్, జాయింట్ సెక్రెటరీ నిర్మలా శేఖర్‌లపై కూడా కేసు నమోదయ్యింది. గుర్తుతెలియని ఓ పోలీసు అధికారి నమోదుచేసిన మూడో కేసు ప్రకారం.. విజయ్ పై 'ఉద్దేశపూర్వకంగా అధికార ప్రదర్శన' - అంటే ర్యాలీకి వెళ్లే మార్గంలో షెడ్యూల్‌లో లేని ప్రాంతంలో ప్రసంగించడం, హైప్, అంచనాలు పెంచడానికి ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా రావడం వంటి కారణాలే తొక్కిసలాటకు దారితీసినట్టు అభియోగం మోపారు.


అయితే, ఈ అభియోగాలపై విజయ్ స్పందిస్తూ.. తానుగానీ, తన పార్టీ గానీ ఎటువంటి తప్పుచేయలేదని అన్నారు. సురక్షిత ప్రదేశంలో ర్యాలీ నిర్వహణ సహా భద్రత ప్రోటోకాల్ అనుసరించామని తెలిపారు. ‘నా పర్యటనలో ప్రజల భద్రతకు సంబంధించిన ఎటువంటి రాజీపడలేదు.. అన్ని రాజకీయ అంశాలను పక్కన పెట్టి, అలాంటి (సురక్షితమైన) ప్రదేశంలో సభ నిర్వహణకు పోలీసుల అనుమతి తీసుకున్నాం’ అని విజయ్ స్పష్టం చేశారు.


కాగా, సెప్టెంబరు 27న తమిళనాడులోని కరూర్‌లో విజయ్ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత విజయ్ స్పందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa