పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55 నుంచి75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో అనవసర ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం.. ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని.. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం రోజు ఉదయానికి పారదీప్ - గోపాల్ పూర్ మధ్యన ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని కారణంగా వచ్చే 24 గంటల్లో ఉత్తరకోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది.
మరోవైపు పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురొవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 20 సెంటీ మీటర్లకు మించి వాన పడే అవకాశం ఉందని.. ఫ్లాష్ ఫ్లడ్కి ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఐదు నుంచి 12 సెం.మీ వాన పడే అవకాశముందన్నారు. అలాగే తూర్పు గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, మూడు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa