ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యా చమురు కొనేవారిపై జీ7 దేశాల ఆంక్షలు.. భారత్‌పై తీవ్ర ప్రభావం

international |  Suryaa Desk  | Published : Thu, Oct 02, 2025, 07:20 PM

తాను రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. 24 గంటల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ప్రగల్భాలు పలికారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటివరకు పాక్షికంగా కాల్పుల విరమణ కూడా చేయలేకపోయారు. దీంతో ఈ యుద్ధాన్ని ఆపుతానంటూ కొత్త దారులు వెతుకుతున్నారు. రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు.. ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవద్దని ఇతర దేశాలను ఆదేశిస్తున్నారు. అందులో భాగంగా రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్‌పై కూడా 25 శాతం అధనంగా సుంకాలు విధించారు. ధనిక దేశాల కూటమి జీ7ను కూడా అలాగే చేయాలన్నారు. అయితే ట్రంప్ చెప్పినట్లే జీ7 దేశాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న వారిపై జీ7 కూటమి దేశాలు సంయుక్తంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించాయి.


జీ7 కూటమి దేశాల ఆర్థిక మంత్రులు బుధవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా చర్చించారు. కలిసికట్టుగా రష్యాపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆ దేశాన్ని ఆర్థికంగా కుంగదీసేలా.. రష్యా ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధించేందుకు కూటమి దేశాలు అంగీకరించాయని తెలిపారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర తర్వాత రష్యా చమురు కొనుగోళ్లను పెంచుతున్న దేశాలనే తాము లక్ష్యంగా చేసుకుంటామని వెల్లడించారు. హైడ్రోకార్బన్ దిగుమతులతో సహా రష్యా నుంచి తమ దేశాలు చేసుకుంటున్న దిగుమతులను దశలవారీగా తగ్గించే లక్ష్యంతో నిర్దిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. రష్యా చేస్తున్న యుద్ధానికి ఆర్థిక సహాయం చేసే దేశాలపై.. వాణిజ్య చర్యలు, ఇతర ఆంక్షలను తీవ్రంగా పరిశీలిస్తున్నామని మంత్రులు చెప్పారు. సమావేశం తర్వాత ఉమ్మడి ప్రకటన వెలువడింది.


రష్యా నుంచి చమురు కొంటున్న దేశాలపై ఒత్తిడి తీసుకురావాలని ఇటీవల జీ7 దేశాలను అమెరికా కోరింది. భారత్‌పై తాము వేసిన అదనపు సుంకాలను ఉదాహరణగా చూపించింది. అయితే భారత్ కన్నా చైనా ఎక్కువగా ఆయిల్ కొనుగోలు చేసినా.. బీజింగ్‌పై అదనపు సుంకాలు విధించకుండా ట్రంప్ ద్వంద్వ వైఖరి ప్రదర్శించారు. జీ7 దేశాలు తీసుకున్న ఈ నిర్ణయంతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాపై ప్రభావం పడనుంది. అయితే ఈ మీటింగ్‌లో భారత్, చైనా పేరులు ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ట్రంప్ వ్యూహాలు ఫలిస్తున్నట్లు కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


భారత్‌పై తీవ్ర ప్రభావం..


ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత్.. రష్యా నుంచి భారీగా చమురు దిగుమతులు చేసుకుంటోంది. మొత్తం ఆయిల్ ఇంపోర్ట్స్‌లు 30–35 శాతం రష్యా నుంచే వస్తోంది. తాజాగా జీ7 దేశాలు తీసుకున్న నిర్ణయం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు చమరు కొనుగోలు చేస్తున్న భారత్.. జీ7 దేశాలు ఆంక్షలు విధిస్తే.. ఆయిల్ మరింత ప్రియం అవుతుంది. మిగతా మార్కెట్ల నుంచి కొనాలన్నా.. ఇప్పటికంటే ధర అధికమవుతుంది. అయితే ఎనర్జీ సెక్యూరిటీ భారత్‌కు అత్యవసరం. ఆ మాటకొస్తే.. ఈ విషయంలో అమెరికా మాట కూడా వినడం లేదు. దీంతో రష్యా నుంచి ఆయిల్ కొంటూనే.. జీ7 దేశాలతో సున్నితంగా వ్యవహరిస్తూ ఇరు వర్గాలను భారత్ దౌత్యంతో బ్యాలన్స్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa