ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ దసరా కార్నివాల్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 06:10 AM

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని విజయవాడ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'విజయవాడ దసరా కార్నివాల్-2025' గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించి చరిత్ర సృష్టించింది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం నాడు నిర్వహించిన ఈ వేడుకల్లో, అత్యధిక సంఖ్యలో డప్పు కళాకారులు ఒకేచోట ప్రదర్శన ఇవ్వడం ద్వారా ఈ అరుదైన ఘనతను సాధించారు. ఈ చారిత్రక ఘట్టంతో బెజవాడ పేరు ప్రపంచ పటంలో మరోసారి మారుమోగింది.ఈ కార్నివాల్‌లో భాగంగా మహాత్మాగాంధీ రోడ్డులో నిర్వహించిన భారీ కార్నివాల్ ర్యాలీ ఈ ప్రపంచ రికార్డుకు వేదికైంది. వేలాది మంది కళాకారులు తమ సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించి సభికులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ అద్భుత ప్రదర్శనను పర్యవేక్షించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు, ఈ ఘనతను అధికారికంగా ధృవీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "ఈ రికార్డు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక గొప్పతనానికి, ప్రభుత్వ ఆశయాలకు ఒక సాక్ష్యం" అని అన్నారు. ఉత్సవాల నిర్వాహకులను, కళాకారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.విజయదశమి రోజున జరిగిన ఈ కార్నివాల్, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు అంగరంగ వైభవంగా సాగింది. సుమారు 3 వేల మంది కళాకారులు తమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఇచ్చారు. అమ్మవారి ఊరేగింపు రథం ఈ ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ జానపద కళారూపాలు, సంప్రదాయ వేషధారణలు, సంగీత, నృత్య ప్రదర్శనలతో విజయవాడ వీధులు కొత్త శోభను సంతరించుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, 'విజయవాడ ఉత్సవ్' జెండా ఊపి కార్నివాల్‌ను ప్రారంభించారు. దాదాపు గంటకు పైగా అక్కడే కూర్చుని 40 కళాబృందాల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు.ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, అమరావతికి మణిహారంగా ఏటా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించారు. "మైసూరు దసరా ఉత్సవాల తరహాలో ప్రతి సంవత్సరం విజయవాడ ఉత్సవ్ ఉంటుంది. సాంస్కృతిక రాజధానిగా విజయవాడకు పూర్వ వైభవం తీసుకురావడమే మా లక్ష్యం" అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉత్సవాలకు కర్త, కర్మ, క్రియ ముఖ్యమంత్రి చంద్రబాబేనని, ఆయన ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని కొనియాడారు. జ్వరం కారణంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని ఆయన తెలిపారు. ఈ విజయం వెనుక ఉన్న 'వైబ్రెంట్ ఫర్ సొసైటీ' సభ్యులకు, విజయవాడ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. వచ్చే ఏడాది దీనిని మరింత ఘనంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa