గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో రెండు వేర్వేరు చోట్ల భారీ దొంగతనాలు జరిగాయి. ఈ ఘటనల్లో దుండగులు బంగారం, నగదు, ఫోన్లను అపహరించారు. తెనాలిలోని చెంచుపేటలో ఒక వివాహానికి తెలంగాణకు చెందిన ఒక IRS అధికారి వచ్చారు. ఆయన తన కారును పార్కింగ్లో ఉంచారు. ఆయన తిరిగి వెళ్లేందుకు పార్కింగ్ దగ్గరకు వెళ్లాకరు.. అయితే అద్దం పగిలి ఉండటాన్ని గమనించారు. దొంగలు కారు అద్దం పగలగొట్టి, అందులోని బ్యాగ్ను ఎత్తుకెళ్లారు. ఆ బ్యాగ్లో 10 లక్షల విలువైన బంగారం, 5 లక్షల నగదు, 3 ఆపిల్ ఫోన్లు, పాస్పోర్ట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయి. IRS అధికారి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
మరోవైపు తెనాలి నియోజకవర్గం పరిధిలోని కొల్లిపర మండలం తూములూరులో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. మోటూరు మధుసూదనరావు ఇంట్లో దొంగలు బీరువా తాళాలు పగలగొట్టారు. దాదాపు రూ.10 లక్షల విలువైన 96 గ్రాముల ఆభరణాలను అపహరించారు. మధుసూదనరావు రాజోలులో రైస్ మిల్ నడుపుతున్నారు. ఆయన భార్య, పిల్లలు పండగ కోసం నరసరావుపేటకు వెళ్లారు. ఈ అవకాశాన్ని దొంగలు ఉపయోగించుకున్నారు. ఇంట్లోకి ప్రవేశించి నగలను దొంగిలించారు. ఇంటి యజమాని తిరిగి వచ్చాక చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెనాలి నియోజకవర్గంలో వరుసగా రెండు భారీ చోరీలు జరగడం కలకలం రేపింది. ఈ రెండు ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దసరా పండగ కావడంతో జనాలు ఊళ్లకు వెళ్లారు.. ఇదే ఛాన్స్ అనుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లు టార్గెట్ చేసి చోరీలకు తెగబడుతున్నారు. దొంగతనాలపై పోలీసులు ముందుగానే ప్రజల్ని హెచ్చరించారు. ఊరికి వెళ్లే వారు ఇంట్లో బంగారం, డబ్బులు, విలువైన వస్తువుల్ని ఉంచొద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా దూర ప్రాంతాలకు వెళుతుంటే.. వారు ఇంటి అడ్రస్, ఫోన్ నంబరు స్థానిక పోలీస్స్టేషన్లో ఇవ్వాలని కూాడా కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa