ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లో రూ.వేల కోట్లు కొట్టేసి పారిపోయిన నీరవ్ మోదీ.. ఎట్టకేలకు అప్పగించనున్న బ్రిటన్

international |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 09:00 PM

 భారత్‌లో వ్యాపారాలు చేస్తూ.. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలు రుణాల కింద తీసుకుని.. వాటిని కట్టకుండా ఎగ్గొట్టి దేశం దాటి పారిపోయిన డైమండ్ బిజినెస్‌మెన్ నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో నీరవ్‌ మోదీ అప్పగింత వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నవంబరు 23వ తేదీన నీరవ్‌ మోదీని.. బ్రిటన్ అధికారులు.. భారత అధికారులకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు నేషనల్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇక నీరవ్ మోదీని అప్పగించడానికి సంబంధించిన ప్రక్రియ కోసం భారత ప్రభుత్వం బ్రిటిష్‌ అధికారులకు తాజాగా హామీపత్రం అందించింది.


ఇక నీరవ్‌ మోదీని భారత్‌కు తీసుకువచ్చిన తర్వాత కేవలం మోసం, మనీలాండరింగ్‌ కేసుల్లో మాత్రమే విచారణ జరుపుతామని భారత్.. బ్రిటన్‌కు చెప్పినట్లు సమాచారం. అతడ్ని ఇతర దర్యాప్తు ఏజెన్సీల కస్టడీకి అప్పగించమని ఆ హామీ పత్రంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈడీ, సీబీఐ, ఐటీ, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌, కస్టమ్స్‌ వంటి సంస్థలు అన్నీ కలిసి సంయుక్తంగా ఈ హామీ పత్రాన్ని అందించినట్లు సమాచారం. భారత్‌కు అప్పగించిన తర్వాత నీరవ్‌ మోదీని ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైల్లో ఉంచనున్నట్లు బ్రిటన్ అధికారులకు భారత అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. హై ప్రొఫైల్‌ ఖైదీలకు అందించే అన్ని సౌకర్యాలను నీరవ్ మోదీకి కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం.


ఇక తనను భారత్‌కు అప్పగించే ప్రక్రియను నీరవ్‌ మోదీ సవాల్‌ చేస్తూ ఇటీవల మరోసారి బ్రిటన్ కోర్టును ఆశ్రయించాడు దర్యాప్తు పేరుతో భారత్‌లోని రకరకాల విచారణ సంస్థలు తనను చిత్రహింసలకు గురిచేస్తాయని ఆ పిటిషన్‌లో నీరవ్ మోదీ పేర్కొన్నాడు. ఈ కేసు మొత్తాన్ని తిరిగి ప్రారంభించాలని కోరడంతో.. ఈ పిటిషన్‌ను లండన్‌ కోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రాన్ని సమర్పించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. నవంబరు 23వ తేదీన తదుపరి విచారణ సమయంలో నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే అవకాశాలున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.


తప్పుడు ఎల్‌వోయూలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)ని నీరవ్‌ మోదీ మోసగించిన వ్యవహారం 2018 జనవరిలో వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీలు దర్యాప్తు ప్రారంభించాయి. అయితే అప్పటికే నీరవ్ మోదీ దేశం విడిచి విదేశాలకు పారిపోయాడు. ఈ క్రమంలోనే నీరవ్ మోదీని ఈడీ పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. అయితే నీరవ్‌ మోదీ తమ దేశంలోనే ఉన్నాడని.. అదే ఏడాది డిసెంబరులో బ్రిటన్‌ ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది.


దీంతో అతడిని తమకు అప్పగించాలని భారత్‌ కోరింది. ఈ క్రమంలోనే 2019 మార్చిలో నీరవ్‌ మోదీను బ్రిటన్ పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. ఇక నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడానికి 2021లో అప్పటి బ్రిటన్‌ హోం శాఖ మంత్రి ప్రీతి పటేల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేసిన నీరవ్ మోదీ.. లండన్‌ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నప్పటికీ కోర్టు కొట్టేసింది. బెయిల్‌ కోసం పలుమార్లు నీరవ్ మోదీ దరఖాస్తు చేసుకున్నా అన్నిసార్లు అతడికి భంగపాటే ఎదురైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa