టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అవినీతికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు విలవిలలాడుతున్నారని నెల్లూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, రాజుపాళెం, ఇనుకుర్తి, ముదిగేడు గ్రామాలలో పర్యటించారు. మందారపు మోహన్ గృహ ప్రవేశం కార్యక్రమంలోకాకాణి పాల్గొన్నారు. అనంతరం శస్త్ర చికిత్స చేయించుకున్న మూడి మస్తానయ్య ను పరామర్శించి, ఇటీవల మరణించిన మాలిపాటి ఓబుల్ రెడ్డి భార్య సీతమ్మ, సంగారపు సుబ్బయ్య భార్య రమణమ్మ కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..` సర్వేపల్లిలో ఎక్కడ చూసినా సోమిరెడ్డి అవినీతి దోపిడీ తప్ప, అభివృద్ధి వెతికినా కనిపించడం లేదు. సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకులు 100 కోట్ల రూపాయల గ్రావెల్ ను కొల్లగొట్టారు. సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకుల అక్రమాలకు విరువూరు, సురాయపాళెం ఇసుక రీచ్ ల చుట్టుపక్కల పల్లెల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. జెన్కో నుండి ఫ్లై యాష్ అక్రమ తరలింపులో తన వాటా మరింత పెంచాలంటూ డిమాండ్ చేస్తూ, సోమిరెడ్డి ఏకంగా జెన్కో మీదకే దాడికి ఉసిగొల్పాడు. పొదలకూరు మండల కేంద్రంలో లేఔట్ల యజమానుల దగ్గర బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకులు డబ్బులు దండుకున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం లో అంగన్వాడీ పోస్టులు అమ్ముకొని ఉద్యోగ నియామక పత్రాలు ఒక్కరికీ, ఉద్యోగాలు చేసేది మరొకరు అంటే, ఉద్యోగ అర్హత లేని వారి దగ్గర డబ్బులు వసూలు చేసి, ఉద్యోగ అర్హత కలిగిన వారికి నియామక పత్రాలు అందించి, అర్హత లేని వారు ఉద్యోగాలు నిర్వహించేటట్టుగా సర్దుబాటు చేశారు. మద్యం దుకాణాలు, బెల్టు షాపులకు సోమిరెడ్డి ప్రాంతాలను బట్టి రేట్లు నిర్ణయించి, నెలవారి మామూళ్లు దండుకుంటున్నాడు. సోమిరెడ్డి ముఠా వెంకటాచలం మండల కేంద్రంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమి కాజేసేందుకు స్కెచ్ వేసింది. సోమిరెడ్డి కనుసన్నలలోనే ప్రభుత్వ, ప్రైవేట్ భూముల ఆక్రమణలు ప్రభుత్వ సంపద, ప్రైవేట్ పొలాల్లో చెట్లు నరికి వేయడం లాంటి దుర్మార్గపు ఘటనలు కోకొల్లలు. సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకుల ఆదేశాలతోనే పామాయిల్ ట్యాంకర్లు దోపిడీ చేయడం, ఖాళీ ట్యాంకర్లను తీసుకొని వెళ్లి, రోడ్డు పక్కన తోసేసి, ఆక్సిడెంట్ లాగా చిత్రీకరించడం లాంటి అధునాతన దోపిడీ పద్ధతులు వెలుగుచూస్తున్నాయి. సోమిరెడ్డి అవినీతి కక్కుర్తికి సర్వేపల్లి నియోజకవర్గం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కూటమిపాలన మోసాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ధాన్యం కోతలు పూర్తయ్యి అమ్మకాలన్ని జరిగి రైతులు తీవ్రంగా నష్టపోయాక, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమంటూ, నాటకాలు ఆడటం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వ ఆగడాలను ఎప్పటికప్పుడు డిజిటల్ బుక్ లో నమోదు చేయండి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల పట్ల అనుచితంగా వ్యవహరించిన ఏ ఒక్కరిని విడిచిపెట్టం. వైయస్ జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండేవారు. చంద్రబాబు ప్రలోభాలకు ఆశపడి ఓట్లు వేసినందుకు, చంద్రబాబు తగిన శాస్తి చేశాడని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, అన్ని విధాలా అండగా నిలుస్తాం` అని కాకాణి గోవర్ధన్రెడ్డి హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa