ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిరిమానోత్సవంలో అపశ్రుతి.! బొత్స సత్యనారాయణ కుటుంబానికి తప్పిన ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 07, 2025, 07:07 PM

వైసీపీ సీనియర్ లీడర్, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుటుంబానికి ప్రమాదం తప్పింది. విజయనగరంలో సిరిమానోత్సవం చూస్తుండగా ప్రమాదం జరిగింది. బొత్స సత్యనారాయణ కుటుంబం కూర్చున్న వేదికగా ఉన్నట్లుండి కుంగిపోయింది. సిరిమానోత్సవం చూసేందుకు బొత్స సత్యనారాయణ కుటుంబ సమేతంగా వచ్చి వేదిక మీద కూర్చున్నారు. అయితే అకస్మాత్తుగా వేదిక కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం అనంతరం తిరిగి యథావిధిగా అందరూ కుర్చీల్లో కూర్చున్నారు. అయితే వేదిక మీదకు పరిమితికి మించి చేరుకోవటంతోనే కుప్పకూలినట్లు తెలుస్తోంది.


మరోవైపు పైడితల్లి అమ్మవారి దర్శనం సందర్భంగా కూడా బొత్స సత్యనారాయణకు అవమానం జరిగిందని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బొత్స సత్యనారాయణ కుటుంబసభ్యులు సాధారణ భక్తుల మాదిరిగా అమ్మవారిని దర్శించుకున్నారని చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ విషయంలో ఆలయ అధికారులు, పోలీసులు ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు పైడితల్లి అమ్మవారి పండుగలో రాజకీయాలకు తావుండకూడదని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.


కిమిడి నాగార్జున సంచలన వ్యాఖ్యలు


మరోవైపు సిరిమానోత్సవం సందర్భంగా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు సిరిమానోత్సవాన్ని డీసీసీబీ భవనం నుంచి చూసేందుకు అనుమతించమని స్పష్టం చేశారు. డీసీసీబీకి తాను ఛైర్మన్‌గా ఉన్నానన్న కిమిడి నాగార్జున.. ఈసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం వచ్చిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. డీసీఎంఎస్‌ ఛైర్మన్‌, పీఏసీఎస్‌ అధ్యక్షులతో కలిసి తాము సిరిమానోత్సవాన్ని చూస్తామని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకున్నామని..ఇంకెవరినీ రానిచ్చేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


బొత్స సత్యనారాయణ వ్యక్తిగత కార్యదర్శి పంపిన లేఖపై స్పందిస్తూ కిమిడి నాగార్జున ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల అహంకార వైఖరి సరికాదన్న కిమిడి నాగార్జున.. డీసీసీబీని నాశనం చేశారన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థను సరిచేస్తున్నట్లు వివరించారు. మరోవైపు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు అయిన విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సిరిమానోత్సవం నేడు (మంగళవారం) కన్నులపండువగా ప్రారంభమైంది. పూజారి వెంకటరావు సిరిమాను అధిరోహించారు. ఉత్సవంలో భాగంగా.. చదరగుడి నుంచి విజయనగరం కోట వరకు ఊరేగింపు నిర్వహించారు. సిరిమానోత్సవాన్ని చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa