దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రచందనం అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయ్యింది. భారీ ఎత్తున దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 10 టన్నుల ఎర్రచందనం పట్టుబడింది. ఏ-గ్రేడ్ రకానికి చెందిన ఈ ఎర్రచందనం విలువ రూ.10 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. తుగ్లాకాబాద్ సమీపంలోని గొడౌన్లో ఎర్రచందనం దుంగలను అక్రమంగా దాచిపెట్టారన్న విశ్వసనీయ వర్గాల సమాచారంతో ఏపీ, సౌత్ ఢిల్లీ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. తిరుపతి నుంచి ఢిల్లీకి వీటిని తరలించినట్టు గుర్తించారు. ఎర్రచందనం దుంగలతో పాటు హైదరాబాద్, ముంబయికి చెందిన ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, హర్యానాకు చెందిన ఓ స్మగ్లర్ తప్పించుకున్నాడు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఈశాన్య ఢిల్లీ డీసీపీ హేమంత్ తివారీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఔషధాల తయారీ కోసం ఎర్రచందనాన్ని ఏపీలోని తిరుపతి నుంచి చైనా, ఇతర దేశాలకు ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. తిరుపతిలో రెండు నెలల కిందట చోరీకి గురైన ఎర్రచందనం దుంగలను తుగ్లాకాబాద్లోని ఓ గొడౌన్లో ఉంచారన్న ఏపీ పోలీసుల సమాచారంతో ఆపరేషన్ చేపట్టినట్టు చెప్పారు. ‘తిరుపతిలో కేసు నమోదు కాగా.. విచారణలో కొందరు నిందితులను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దుంగలను ఢిల్లీకి తరలించినట్టు విచారణలో నిందితులు వెల్లడించారు. సోమవారం ఏపీ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించాం’ అని వివరించారు.
‘దాడుల్లో దాదాపు 9.5 టన్నుల ఎర్రచందనం దుంగలు, హైదరాబాద్కు ఇర్ఫాన్, ముంబయిలోని థానేకు చెందిన అమిత్ సంపత్ పవార్ అనే ఇద్దర్ని అరెస్ట్ చేశాం.. ఆగస్టు తొలివారంలో తిరుపతిలో చోరీచేసిన ఎర్రచందనాన్ని ఓ ట్రక్కులో ఢిల్లీకి గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. ఢిల్లీలో జరిగిన అతిపెద్ద ఎర్రచందనం చోరీల్లో ఇది ఒకటి’ అని ఆ అధికారి తెలిపారు.
‘నిందితులు వీటిని విదేశీ మార్కెట్లకు, ముఖ్యంగా చైనా, దక్షిణాసియా దేశాలకు అక్రమంగా రవాణా చేయాలని ప్లాన్ చేశారు, అక్కడ ఎర్రచందనం ఔషధ, వాణిజ్య పరంగా చాలా ఎక్కువ ధర పలుకుతుంది. ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతాల నుంచి ఎర్ర చందనం దుంగలను సేకరించి, లారీలలో ప్రత్యేకంగా దాచిన గదుల ద్వారా రవాణా చేస్తున్నారని దర్యాప్తు సమయంలో నిందితులు అంగీకరించారు.. పట్టుబడిన ఈ దుంగలను అక్రమ రవాణా నెట్వర్క్ ద్వారా దేశం దాటించేందుకు సిద్ధమయ్యారు’ అని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa