చేయని పనికి క్రెడిట్ తీసుకోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుంటారు. అందుకే భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది తానేనని అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా చెబుతూనే ఉన్నారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో పాకిస్థాన్ ప్రాధేయపడితేనే.. కాల్పులు విరమణకు ఒప్పుకున్నామని.. ఇందులో మూడో దేశం పాత్ర లేదని భారత్ ఎన్నిసార్లు చెప్పినా.. ట్రంప్ పాత పాటే పాడుతున్నారు. వాణిజ్యంతో యుద్ధాలు ఆపానని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి యుద్ధాలు ఆపడానికి.. తద్వారా ప్రంపచశాంతి నెలకొల్పడం కోసమే వివిధ దేశాలపై టారిఫ్లు విధిస్తున్నామని వింత వాదన చేశారు.
అమెరికా శాంతి దూత..
భారత్ సహా వివిధ దేశాలపై విధిస్తున్న సంకాలను మీరు ఎలా సమర్థించుకుంటారు అనే ప్రశ్నకు సమాధానంగా.. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. టారిఫ్ల వల్ల ఖజానా నిండి అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా.. ప్రపంచ దేశాలపై అమెరికా ప్రభావం చూపించొచ్చని అన్నారు. అంతేకాకుండా టారిఫ్ల వల్ల లక్షల కోట్ల ఆదాయం సమకూరడమే కాకుండా.. తమ దేశాన్ని శాంతిదూతగా నిలబెడుతుందన్నారు. ఈ క్రమంలోనే భారత్, పాక్ యుద్ధం ఆగడంలో తాము విధించిన సుంకాలే కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.
"నాకు సుంకాలు విధించే అధికారం లేకపోతే.. ఇప్పటికే ప్రపంచంలో మీరు ఏడు యుద్ధాల్లో.. కనీసం నాలుగు యుద్ధాలను చూసేవారు. యుద్ధాలను ఆపడానికి నేను సుంకాలను ఉపయోగిస్తాను. మీరు భారత్, పాకిస్థాన్ను చూస్తే.. వారు ఒకరిపై ఒకరు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏడు విమానాలను కూలాయి. పైగా ఆ రెండు అణ్వాయుధ దేశాలు. వారికి నేనేం చెప్పానో ఇప్పుడు చెప్పదలచుకోలేదు. కానీ నేను వారికి చెప్పిన మాటలు చాలా ప్రభావం చూపించాయి. వెంటనే వారు ఆగిపోయారు. సుంకాల ఆధారంగానే అది జరిగింది" అని ప్రగల్భాలు పలికారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.
డొనాల్డ్ ట్రంప్ అవకాశం దొరికిన ప్రతిసారి ఈ పాటే పాడుతున్నారు. గత నెల ఓ రిపబ్లికన్ నేత ఇంట్లో డిన్నర్ సమయంలో.. ప్రపంచంలో తాను చాలా యుద్ధాలు ఆపినట్లు పేర్కొన్నారు. కానీ ట్రంప్ ప్రకటనలను భారత అధికారులు తీవ్రంగా ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పార్లమెంట్ వేదికగా ట్రంప్ పగల్భాలను ఎండగట్టారు. భారత్ ఆపరేషన్ సిందూర్ ఆపేయాలనే నిర్ణయాన్ని.. ఏ విదేశీ నేత ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. అయినా ట్రంప్ మారడం లేదు. నోబెల్ శాంతి బహుమతి కోసం పరితపిస్తున్నందునే ట్రంప్ ఇలా ప్రవర్తిస్తున్నారనే అభిప్రాయం కూడా కొందరిలో వ్యక్తమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa