పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ఆ దేశం దుర్భర దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతోందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వంటి సంస్థల నుంచి భారీగా రుణాలు తీసుకుంటున్నా దేశంలో పేదరికం తగ్గకపోగా మరింత తీవ్రమవుతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో అమలవుతున్న ఆర్థిక వృద్ధి నమూనా పూర్తిగా విఫలమైందని, పేదల జీవితాలను మెరుగుపరచడంలో ఘోరంగా విఫలమైందని స్పష్టం చేసింది. ఈ మేరకు 'రిక్లెయిమింగ్ మొమెంటం టువార్డ్స్ ప్రాస్పరిటీ: పాకిస్థాన్స్ పావర్టీ, ఈక్విటీ అండ్ రెసిలియెన్స్ అసెస్మెంట్' పేరుతో సెప్టెంబర్ 23న విడుదల చేసిన నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, పాకిస్థాన్లో పేదరికం హెడ్కౌంట్ నిష్పత్తి (హెచ్సీఆర్) గత ఎనిమిది సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి, అంటే 25.3 శాతానికి చేరింది. కేవలం 2023 నుంచి చూస్తేనే ఇది 7 శాతం పెరుగుదల కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒకప్పుడు పాకిస్థాన్ పేదరిక నిర్మూలనలో గణనీయమైన పురోగతి సాధించింది. 2001లో 64.3 శాతంగా ఉన్న పేదరికాన్ని 2018 నాటికి 21.9 శాతానికి తగ్గించగలిగింది. 2015 వరకు ఏటా 3 శాతం చొప్పున పేదరికం తగ్గుముఖం పట్టినా, ఆ తర్వాత దాని వేగం సంవత్సరానికి ఒక శాతం కంటే తక్కువకు పడిపోయింది. అయితే, ప్రభుత్వాల విధానాలు, వరుస సంక్షోభాల కారణంగా కష్టపడి సాధించిన ఈ ప్రగతి పూర్తిగా తలకిందులైందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa