మహిళా ఉద్యోగుల సంక్షేమం దిశగా కర్ణాటక ప్రభుత్వం ఒక కీలక అడుగు ముందుకేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు ప్రతి నెలా ఒక రోజు వేతనంతో కూడిన నెలసరి సెలవు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.ఈ కొత్త విధానం ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలతో పాటు టెక్స్టైల్, ఐటీ, బహుళజాతి కంపెనీలు సహా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు సంస్థల్లోని మహిళా సిబ్బందికి వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళా ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వారికి మద్దతుగా నిలుస్తూ, ప్రోత్సాహకరమైన పని వాతావరణాన్ని సృష్టించడమే తమ లక్ష్యమని పేర్కొంది. మహిళల శారీరక, మానసిక ఆరోగ్యంపై సమాజంలో అవగాహన పెంచేందుకు కూడా ఇది దోహదపడుతుందని వివరించింది.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతో మంది మహిళలు ప్రయోజనం పొందుతారని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ అభిప్రాయపడ్డారు.ఇప్పటికే దేశంలోని బిహార్, కేరళ, ఒడిశా, సిక్కిం వంటి రాష్ట్రాలు మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో కర్ణాటక కూడా చేరింది. ప్రభుత్వాలే కాకుండా, జొమాటో, స్విగ్గీ, ఎల్ అండ్ టీ వంటి కొన్ని ప్రైవేటు సంస్థలు సైతం ఇప్పటికే తమ మహిళా ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే సంఘటిత రంగంలో ఈ మార్పులు వస్తున్నప్పటికీ, అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు ఇలాంటి సౌకర్యాలు కల్పించడం ఇప్పటికీ ఒక సవాలుగానే ఉందని మహిళా హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa