మధ్య ప్రదేశ్లోని భోపాల్కు చెందిన రిటైర్డ్ పీడబ్ల్యూడీ చీఫ్ ఇంజినీర్ జి.పి. మెహ్రా ఇంటిపై దాడులు చేసిన లోకాయుక్త అధికారులు ఆయన ఆస్తులు చూసి అవాక్కయ్యారు. గురువారం రోజు ఆయన ఆస్తులపై చేసిన మెరుపు దాడుల్లో కుప్పలుగా నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, వెండి, 17 టన్నుల తేనె లభించాయి. ఇవన్నీ చూసిన అధికారులకు కళ్లు తిరిగినంత పని కాగా.. ఈ కేసు రాష్ట్ర చరిత్రలోనే అత్యంత సంచలనాత్మక అవినీతి కేసుల్లో ఒకటిగా మారింది.
భోపాల్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తు చేస్తుండగా.. ప్రజా పనుల విభాగంలో చీఫ్ ఇంజినీర్గా పని చేసి పదవీ విరమణ పొంది జీపీ మెహ్రా పేరు వినిపిచింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయనపై దృష్టి సారించారు. ఈక్రమంలోనే మెహ్రాకు సంబంధించిన వేర్వేరు ప్రాంతాల్లోని నాలుగు ఇళ్లపై దాడులు చేశారు. ఏకకాలంలో ఈ ఆపరేషన్ నిర్వహించగా.. ఇందులో నలుగురు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈక్రమంలోనే మణిపురం కాలనీలోని మెహ్రా నివాసంలో దర్యాప్తు అధికారులు మొదట రూ. 8.79 లక్షల నగదు, దాదాపు రూ. 50 లక్షల విలువైన ఆభరణాలు, రూ. 56 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే దాణాపాని సమీపంలోని ఓపల్ రీజెన్సీలోని ఆయన లగ్జరీ అపార్ట్మెంట్లో రూ. 26 లక్షల నగదు, రూ. 3.05 కోట్ల విలువైన 2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోహాగ్పూర్ తహసీల్లోని సైనీ ఫామ్హౌస్లో మరింత అసాధారణమైన ఆస్తులు లభించాయి. ఇక్కడ అధికారులు 17 టన్నుల తేనెను నిల్వ ఉంచినట్లు కనుగొన్నారు. దీంతో పాటు ఆరు ట్రాక్టర్లు, 32 నిర్మాణంలో ఉన్న కాటేజీలు, ఏడు పూర్తయిన కాటేజీలు, చేపల పెంపకం కోసం ఒక ప్రైవేట్ చెరువు, గోశాల, ఒక ఆలయం, ఫోర్డ్ ఎండీవర్, స్కోడా స్లావియా, కియా సోనెట్, మారుతి సియాజ్ వంటి లగ్జరీ కార్లను గుర్తించారు. ఇవన్నీ మెహ్రా కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్టర్ అయి ఉన్నాయి.
ఇవి మాత్రమే కాకుండా గోవిందపుర పారిశ్రామిక ప్రాంతంలోని కేటీ ఇండస్ట్రీస్పై కూడా లోకాయుక్త దాడులు చేసింది. ఇది కూడా మెహ్రా వ్యాపార కేంద్రంగా అధికారులు అనుమానిస్తున్నారు. ఇక్కడ రూ. 1.25 లక్షల నగదు, పరికరాలు, ముడిసరుకు, మెహ్రా బంధువులను వ్యాపార భాగస్వాములుగా చూపుతున్న కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా మొత్తం నాలుగు చోట్ల చేసిన దాడుల్లో మొత్తంగా రూ. 36.04 లక్షల నగదు, 2.649 కిలోల బంగారం, 5.523 కిలోల వెండి, అనేక ఫిక్స్డ్ డిపాజిట్లు, బీమా పాలసీలు, షేర్ పత్రాలు, స్థిరాస్తుల డాక్యుమెంట్లు, నాలుగు లగ్జరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల విలువ మరింతగా పెరిగే అకాశం ఉందని.. లోకాయుక్త అధికారులు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, డిజిటల్ ఫైళ్లు, బ్యాంకింగ్ రికార్డులను ఫోరెన్సిక్ బృందాలు పరిశీలించడం ప్రారంభించాయి. మెహ్రా ఆర్థిక లావాదేవీల చరిత్రను, బినామీ పెట్టుబడులను గుర్తించేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa