ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు.. 80 లక్షల ఫాలోవర్లు ఫట్

national |  Suryaa Desk  | Published : Sat, Oct 11, 2025, 07:09 PM

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అధికారిక ఫేస్‌బుక్ ఖాతా అనూహ్యంగా సస్పెండ్ కావడం దేశ రాజకీయాలలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 80 లక్షల మందికి పైగా ఫాలోవర్లు కలిగిన అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ పేజీ శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో అకస్మాత్తుగా 'ఆఫ్‌లైన్‌'లోకి వెళ్లిపోయింది. రాజకీయ అభిప్రాయాలు, ప్రభుత్వ విధానాలపై విమర్శలు, పార్టీ మద్దతుదారులతో నిరంతరం టచ్‌లో ఉండటానికి ఎస్పీ అధినేత ఈ సోషల్ మీడియా వేదికను ప్రధానంగా ఉపయోగించేవారు. ఇలాంటి సమయంలో ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఖాతా నిలిపివేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.


అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతా సస్పెన్షన్‌పై సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి ఫక్రుల్ హసన్ చాంద్ గట్టిగా స్పందించారు. ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెడుతూ.. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని మూడో అతి పెద్ద పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతాను సస్పెండ్ చేయడం అనేది ప్రజాస్వామ్యంపై నేరుగా జరిగిన దాడని ఫక్రుల్ హసన్ చాంద్ పేర్కొన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్ష స్వరాన్ని బీజేపీ అణచివేయాలని చూస్తోందని అన్నారు. అయితే బీజేపీ ఏం చేసినా.. సమాజ్‌వాదీ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఆపబోదు అని ఆయన గట్టిగా స్పష్టం చేశారు.


ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటా ఈ ఖాతా సస్పెన్షన్ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. సాధారణంగా పెద్ద రాజకీయ నాయకుల సోషల్ మీడియా ఖాతాలు నిలిచిపోయినప్పుడు.. ప్లాట్‌ఫారమ్‌లు తక్షణమే వివరణ ఇస్తుంటాయి. కానీ అఖిలేష్ యాదవ్ విషయంలో మాత్రం మెటా మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.


సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి ప్రభుత్వం ప్రతిపక్షాల గళాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోందనే సమాజ్‌వాదీ పార్టీ ఆరోపణలకు ఈ సస్పెన్షన్ బలం చేకూరుస్తోంది. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడానికి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కీలకమైన సోషల్ మీడియా వేదికను మూసివేయడం, భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా పరిగణించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ సస్పెన్షన్‌కు అసలు కారణం ఏమిటి? ఇది కేవలం సాంకేతిక లోపమా లేక రాజకీయ ప్రేరేపిత చర్యనా? అనే విషయాలు ఫేస్‌బుక్ స్పష్టత ఇస్తేనే వెల్లడవుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa