అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరింది. చైనా నుంచి వచ్చే అన్ని దిగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. దీనిపై చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికా ఏకపక్షంగా ద్వంద్వ ప్రమాణాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, తాము ప్రతీకార చర్యలకు వెనుకాడబోమని గట్టిగా హెచ్చరించింది.శుక్రవారం రాత్రి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. నవంబర్ 1 నుంచి చైనా నుంచి దిగుమతయ్యే అన్ని వస్తువులపై ప్రస్తుతం ఉన్న పన్నులకు అదనంగా 100 శాతం సుంకం అమల్లోకి వస్తుందని తెలిపారు. అంతేకాకుండా, అమెరికాలో తయారైన కీలకమైన సాఫ్ట్వేర్ల ఎగుమతులపై కూడా కఠినమైన నియంత్రణలు విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చైనా వాణిజ్యపరంగా అత్యంత దూకుడుగా వ్యవహరిస్తోందని, దానికి తగిన బదులు ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.ట్రంప్ నిర్ణయంపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఘాటుగా స్పందించింది. అమెరికా చర్యలు తమ దేశ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తాయని, ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చల వాతావరణాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని పేర్కొంది. “మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ పోరాడటానికి భయపడం” అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. అమెరికా తన వైఖరిని మార్చుకోకపోతే తమ చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనిలో భాగంగా అమెరికాకు చెందిన నౌకలపై ప్రత్యేక పోర్టు ఫీజులు విధించనున్నట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa