ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్-కిమ్ మధ్య మరో సమావేశానికి ఈ నెలాఖరులో ఏపీఈసీ సదస్సు వేళ భేటీకి ఆస్కారం

international |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 06:03 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య మరోసారి కీలక సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలాఖరులో జరగనున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార  సదస్సు సందర్భంగా ఈ భేటీ జరగవచ్చని దక్షిణ కొరియా కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల సరిహద్దులోని పాన్‌మున్‌జోమ్ గ్రామం ఈ చారిత్రక సమావేశానికి వేదిక కావచ్చని అంచనా వేసింది.మంగళవారం పార్లమెంటులో జరిగిన ఆడిట్ సెషన్‌లో ఈ అంశంపై అధికార డెమోక్రటిక్ పార్టీ ఎంపీ యూన్ హు-దుక్ అడిగిన ప్రశ్నకు దక్షిణ కొరియా ఏకీకరణ మంత్రి చుంగ్ డాంగ్-యంగ్ సమాధానమిచ్చారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇరు దేశాల నేతలు చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్‌తో తనకు 'మంచి జ్ఞాపకాలు' ఉన్నాయంటూ ఇటీవల కిమ్ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. దీనిబట్టి షరతులతో కూడిన చర్చలకు కిమ్ సుముఖంగా ఉన్నట్లు అర్థమవుతోందని వివరించారు.ఉత్తర కొరియాపై ఉన్న అణ్వస్త్ర నిర్మూలన డిమాండ్‌ను అమెరికా పక్కన పెడితే చర్చలకు సిద్ధమని గత నెలలో కిమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దక్షిణ కొరియాతో అమెరికా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలపై చర్చించేందుకు ట్రంప్ సుముఖత వ్యక్తం చేస్తే ఈ సమావేశం జరిగే ఆస్కారం ఉందని మంత్రి చుంగ్ అభిప్రాయపడ్డారు. "ఇక నిర్ణయం తీసుకోవాల్సింది ట్రంప్ మాత్రమే" అని ఆయన స్పష్టం చేశారు.ఈ నెలాఖరులో దక్షిణ కొరియాలోని గ్యాంగ్‌జూ నగరంలో ఏపీఈసీ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ట్రంప్ దక్షిణ కొరియా రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ నేతల పర్యటన దృష్ట్యా ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్  ఇప్పటికే భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించింది. జాతీయ గూఢచార సంస్థ, పోలీసు, సైనిక విభాగాలతో కలిసి సమగ్ర భద్రతా చర్యలపై చర్చించినట్లు పీఎస్ఎస్ చీఫ్ హ్వాంగ్ ఇన్-క్వోన్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa